జంప్ జిలానీలకు హైకోర్టు షాక్ .. విలీన ఉత్తర్వులు రద్దు చేసే అధికారం కోర్టుకుందని వ్యాఖ్య
తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లంత ఘోర ఓటమి పాలయ్యారు. కాస్త అక్కడక్కడా అధికార పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న దగ్గర మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం మీద పొత్తులో భాగంగా ఒక 19 స్థానాలను కాంగ్రెస్ నిలుపుకుంది.
సీఎల్పీ విలీన కుట్రను భగ్నం చెయ్యాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
అయితే ఎన్నికలు అయి ఫలితాలు ఇలా వచ్చాయో లేదో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీ మారి టీఆర్ఎస్లో చేరిపోతున్నారు .కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపులు పెద్ద తలనొప్పిగా పరిణమిస్తున్న తరుణంలో సీఎల్పీ విలీన కుట్రని భగ్నం చెయ్యాలని భావించి కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్న హైకోర్టు
అయితే ప్రజలు నమ్మకంతో ఓటేసి గెలిపించాక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్ట్ గట్టి షాక్నే ఇచ్చింది. పార్టీలు మారటాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు హైకోర్ట్లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై విచారణ జరిపిన హైకోర్ట్ ఇప్పుడు అత్యవసరంగా ఈ పిటిషన్పై విచారణ అవసరం లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది. అయితే ఈ విషయంపై తదుపరి పూర్తి విచారణను జూన్ 11కి వాయిదా వేసింది .
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేస్తే రద్దు చేసే అధికారం కోర్టుకుందన్న ధర్మాసనం
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద వాటిని రద్దు చేసే అధికారం ఈ కోర్టుకు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విలీనం అక్రమమని ఈ కోర్టును ఒప్పించగలిగితే చర్యలు ఉంటాయి అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది . సీఎల్పీని విలీనం చేయకుండా పార్టీ ఫిరాయించినంత మాత్రాన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయిపోరని స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తే, వారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ప్రకటించే అధికారం న్యాయస్థానానికి ఉందని తేల్చి చెప్పి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది.