షాకింగ్ ... పోలీసులపై దాడికి తెగబడ్డ ఇసుకమాఫియా .. ఒకరికి గాయాలు
Recommended Video
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేయడమే కాకుండా అడ్డువచ్చిన పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తూ అక్రమ రవాణా చేస్తున్నది కాక, పోలీసులకు సైతం సవాలు విసురుతున్నారు. తాజాగా ఇసుక మాఫియా పోలీసులపై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మెదక్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మెదక్ జిల్లా పాపన్నపేట పోలీసు కానిస్టేబుల్పై ఇసుకాసురులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గత కొంతకాలంగా కొల్చారం మండల పరిధిలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పాపన్నపేట పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్న 13 మంది వారిపై దాడి చేశారు. ఈ దాడిలో మహేశ్కుమార్ అనే కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అయితే ఇసుక మాఫియా దాడికి పాల్పడింది అంటే పోలీసుల పరువు పోతుందని భావించి దాడి విషయాన్ని పోలీసులు బయటపెట్టలేదు.
అయితే పోలీసులపై ఇసుక మాఫియా దాడి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు స్పందిస్తూ కొల్చారం, పాపన్నపేట మండలాల పరిధిలోని మంజీరా పరీవాహక ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్నవారు పోలీసులపై దాడి చేశారని, 10 మందిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారయ్యారన్నారు. పరారీలో ఉన్న వారిని పట్టుకుననే పనిలో ఉన్నామని, వీరందరి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.