దిశా కేసులో షాకింగ్ ట్విస్ట్ .. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ?
Recommended Video
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారి కుటుంబాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఒక ప్రాణానికి నాలుగు ప్రాణాలు తీశారని మృతుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఇక ఈ కేసులో కొత్త అంశం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు అన్న చర్చ ఇప్పుడు ఈ కేసును కీలక మలుపు తిప్పుతుంది.
Disha case:మృతుల కుటుంబాల ఆవేదన ..నా భర్తతో పాటు నన్ను కూడా చంపెయ్యండన్న చెన్నకేశవులు భార్య
ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలతో మాట్లాడిన ఎన్హెచ్ఆర్సీ బృందం
తాజాగా దిశ అత్యాచారం,హత్యా ఘటన,ఆ తర్వాత నిందితుల ఎన్కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమీషన్ విచారణ చేస్తుంది. ఈ కేసును సుమోటోగా తీసుకుని మానవ హక్కుల కమీషన్ బృందం తెలంగాణా రాష్ట్రంలో విచారణ కొనసాగిస్తుంది . ఇక ఇదే క్రమంలో ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులతో మాట్లాడారు బృంద సభ్యులు. నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లని ఎన్ హెచ్ ఆర్ సి విచారణలో వెలుగులోకి వచ్చింది.
జొల్లు నవీన్, జొల్లు శివ మైనర్లు అంటున్న తల్లి దండ్రులు
తమ కొడుకులు జొల్లు నవీన్, జొల్లు శివ మైనర్లని వారి తల్లిదండ్రులు ఎన్హెచ్ఆర్సీ బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాక దాన్ని నిరూపించడం కోసం జొల్లు నవీన్ , శివ ల బోనఫైడ్ సర్టిఫికెట్లను కూడా చూపించారని సమాచారం. దీంతో ఎన్హెచ్ఆర్సీ సభ్యులు మృతుల ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ను పరిశీలించారు. దీంతో దిశ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పాలి.
ఎన్హెచ్ఆర్సీ బృందానికి సర్టిఫికెట్లు చూపించిన తల్లిదండ్రులు
జొల్లు శివ స్కూల్ రిజిస్టర్లో నమోదైన బర్త్ డేట్ ఆధారంగా చూస్తే అతను ఆగష్టు 15, 2002లో జన్మించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గుడిగండ్ల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ ఆధారంగా శివ 2008-12 మధ్య 2వ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదివినట్లు స్పష్టం అయింది.ఇక అతను డిసెంబర్ 6న మరణించిన నాటికి 17 సంవత్సరాలు, మూడు నెలల 22 రోజుల వయసులో ఉన్నాడు. అంటే అతను మైనర్ అని అర్ధం అవుతుంది.
నవీన , శివ ఇద్దరి వయసు దాదాపు ఒకటే .. 17 సంవత్సరాలు అన్న తల్లిదండ్రులు
అటు జొల్లు నవీన్ తల్లి జొల్లు లక్ష్మి కూడా తన కొడుకు మైనర్ అని పేర్కొంది. ‘తన కొడుకు 2002 ఆఖర్లో జన్మించాడని.. ఆ తర్వాత నాలుగేళ్ళకు భర్త ఎల్లప్ప క్యాన్సర్ కారణంగా మృతి చెందాడని తెలిపింది. అంతేకాకుండా గ్రామస్తులు అందరూ కూడా శివ, నవీన్లు ఏడో తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారన్నారు. కాగా, గత సంవత్సర కాలంగా ఇద్దరూ కూడా క్లీనర్లుగా పని చేస్తున్నారని చెప్పారు.నవీన్ , శివ ఇద్దరూ కలిసే చదువుకున్నారని, ఆ తర్వాత కూడా కలిసే లారీల మీద క్లీనర్ లు గా వెళ్ళారని చెప్పారు.
హైదరాబాద్ కు శివ , నవీన్ తల్లిదండ్రులను పిలిపించిన ఎన్హెచ్ఆర్సీ బృందం
నవీన్ తల్లి లక్ష్మిని, శివ తండ్రి రాజన్నను ఎన్హెచ్ఆర్సి దర్యాప్తు బృందం హైదరాబాద్కు పిలిపించి మాట్లాడారు.ఎన్హెచ్ఆర్సి దర్యాప్తు బృందంతోమాట్లాడిన వారు పోలీసుల చర్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు నేరం చేసినా పోలీసులు ఇలా క్రూరంగా చంపటం న్యాయం కాదని నవీన్ తల్లి లక్ష్మీ కన్నీరు మున్నీరు అయ్యారు . అటు శివ తండ్రి కూడా ‘ఎన్కౌంటర్'ను తీవ్రంగా ఖండించారు.
న్యాయస్థానం మరణ శిక్ష వేసినా ఓకే .. కానీ ఇది అన్యాయం అన్న తల్లిదండ్రులు
న్యాయస్థానం కేసును విచారించి తప్పు చేశారని భావిస్తే తమ కొడుకులకు మరణశిక్ష విధించినా కచ్చితంగా ఒప్పుకునేవాళ్లమని కానీ పోలీసులు ఇలా నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేయడం సరికాదన్నారు. ఇప్పటికీ కనీసం మృతదేహాలను కూడా అప్పగించలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికే పలు కీలక మలుపులు తిరిగిన ఈ కేసు తాజా పరిణామాల నేపధ్యంలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.