షాకింగ్ ట్విస్ట్ .. పెళ్లి చేసింది బజరంగ్ దళ్ కాదు .. ఆత్మహత్యకు యత్నించింది ఆ జంట కాదు
ప్రేమికుల రోజున... తాము భజరంగ్దళ్ కార్యకర్తలమంటూ ఓ ప్రేమికుల జంట కు బలవంతంగా పెళ్లి చేసి వారి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ప్రేమ జంట బలవంతపు పెళ్లి వివాదంగా మారింది. ఇక దీంతో మనస్తాపం చెందిన ఆ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ప్రచారం జరిగింది. అయితే బజరంగ్ దళ్ కార్యకర్తలమంటూ పెళ్లి చేసిన వారు సైతం బజరంగ్ దళ్ కార్యకర్తలు కారని తెలియడంతో షాక్ కు గురయ్యారు ఆ ప్రేమ జంట. అంతేకాదు ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట ఆ జంట కాదని తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన జంట ఈ జంట కాకుంటే మరి ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఈ వ్యవహారంలో సోషల్ మీడియా పుణ్యమాని ఆ ప్రేమ జంటకు అన్నీ షాక్ లే తగులుతున్నాయి.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఆ జంట కాదు.. మరో షాకింగ్ విషయం వెల్లడి
ఫిబ్రవరి 14... వేలంటైన్స్ డే రోజున హైదరాబాద్ శివారులోని కండ్లకోయలో ఆక్సిజన్ పార్క్ లో ఓ ప్రేమజంటను... తాము భజరంగ్దళ్ కార్యకర్తలమంటూ కొందరు అడ్డుకుని, బలవంతంగా పెళ్లి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ప్రేమికుడు సిద్దిపేటకు చెందిన రాకేష్రెడ్డి , అమ్మాయి హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో నివాసముంటుంది. అయితే ప్రేమికుల రోజున... మేడ్చల్ ప్రాంతంలో కలుసుకున్న వీరికి భజరంగ్దళ్ కార్యకర్తలమంటూ బలవంతంగా పెళ్లి చేశారు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వారు కుటుంబ సభ్యులతో మాట్లాడటం, వారిని ఒప్పించడం జరిగింది. తమపై వైరల్ అవుతున్న వీడియోలు చూసి కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే పెళ్లి చేసింది తమ కార్యకర్తలు కాదని, చేసిన వారికి బజరంగ్ దళ్ కు సంబంధం లేదని వారు ఎవరో తమకు తెలీదని స్వయంగా బజరంగ్ దళ్ ప్రకటించి షాక్ ఇచ్చింది.
అయితే శనివారం ఉదయాన్నే ఇదే ప్రేమజంట హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసిందనే పుకారు షికారు చేసింది. భజరంగ్దళ్ కార్యకర్తలు బలవంతంగా పెళ్లి చేయడం, దీనిపై ఇంట్లోవారు అంగీకరిస్తారా లేదా అన్న భయంతో ప్రేమికులిద్దరూ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్త విన్న ప్రేమికుడు రాకేష్ రెడ్డి మరో మారు షాక్ అయ్యారు. కానీ అదంతా అవాస్తవమని ప్రేమికుడు రాకేష్ రెడ్డి చెప్తున్నారు.
ప్రేమ జంటకు తలనొప్పిగా మారిన సోషల్ మీడియా ప్రచారం
ఇక బజరంగ్ దళ్ పేరుతో పెళ్లి చేసిన జంట సోషల్ మీడియా ప్రచారం తలనొప్పిగా తయారైంది . ప్రేమికుల రోజున జరిగిన ఘటనను మరచిపోవాలని ప్రయత్నం చేసినా సోషల్ మీడియా మాత్రం దాన్ని వదలటం లేదని బాధ పడుతున్నారు.ఆత్మహత్యా యత్నం తాము చెయ్యలేదని కానీ సోషల్ మీడియా ప్రచారంతో షాక్ తిన్నామని చెప్తున్నారు ఆ ప్రేమ జంట . సోషల్ మీడియాలో చేసిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అయినా తాము ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు 19, అమ్మాయికి 18 ఏళ్ల వయసు ఉందని మరో మూడు సంవత్సరాలు ఆగిన తరువాత, జీవితం లో స్థిరపడిన తరువాతనే పెళ్లి చేసుకుంటామని అందుకు పెద్దలను సైతం ఒప్పించామని రాకేష్ రెడ్డి చెప్పారు.
ఆత్మహత్యా యత్నం చేసింది మరో జంట .. పోలీసులు క్లారిటీ ఇవ్వకనే ఈ ప్రచారం
అయితే హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమజంట మరొకటి అని తేలింది. ప్రేమికుల రోజునే సిద్దిపేట కోమటిచెరువుపై విహరిస్తున్న ఓ ప్రేమ జంటను కొందరు అడ్డుకుని, బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో హెచ్చరించి వదిలేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట హైదరాబాద్ ట్యాంక్బండ్పై నుంచి దూకారు. అయితే అక్కడి లేక్వ్యూ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. వారిద్దరి వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే ఆ జంట ఎవరు అనేది పోలీసుల క్లారిటీ ఇవ్వడం ఇవ్వకపోవడం తో ఇంత గందరగోళం జరిగింది. బజరంగ్ దళ్ కార్యకర్తలమంటూ పెళ్లి చేసిన జంటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జంట అని ప్రచారం జరిగింది. కానీ ప్రేమికుడు రాకేష్ రెడ్డి చెప్పిన విషయాలతో అది అవాస్తవం అని తేలింది.