దర్యాప్తులో చిన్న బ్రేక్..! శివాజీ, రవిప్రకాశ్ పిటిషన్ల విచారణ వాయిదా..!!
హైదరాబాద్: టీవీ9 ఫోర్జరీ కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ కు హైకోర్ట్ లో ఊరట లభించింది. రవి ప్రకాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. టీవీ9 బోర్డులో డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడ్డ రవిప్రకాశ్, ఇందుకోసం ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు అలంద మీడియా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది.
అలాగే టీవీ9 లోగోను కారుచవకగా మరో సంస్థకు అమ్మేందుకు ప్రయత్నించడంపై కూడా మరో ఫిర్యాదు చేసింది. అలాగే నటుడు శివాజీపై కూడా ఈ సందర్భంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల రూపురేఖలు మార్చుకుని అమెరికాకు పారిపోతున్న నటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన పాస్ పోర్టును జప్తు చేసిన పోలీసులు, ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. ఇదిలా ఉండగా తనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను కొట్టేయాలని శివాజీ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు, తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇటీవల శివాజీ అమెరికాకు పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణకు సహకరించాలంటూ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.
రవి ప్రకాశ్ కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. పలు నేరారోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తాజాగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సైబరాబాద్ పోలీసులకు.. బంజారాహిల్స్ పోలీసులకు విచారణలో చుక్కలు చూపించిన రవిప్రకాశ్..
తన ముందస్తు బెయిల్ పిటిషన్ పైనా కొత్త తరహా వాదనను వినిపించటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీవీ 9 కొత్త యాజమాన్యం అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్ తో పాటు శివాజీపైనా కేసులు నమోదు అయ్యాయి.
ఈ కేసుల విచారణకు సహకరించాల్సిందిగా రవిప్రకాశ్ తో పాటు శివాజీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు వీరిద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాకుండా ఈ వివాదంలో తమ తప్పేమీ లేదని, అలంద మీడియా చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని వారిద్దరూ కోర్టు గడప తొక్కారు.