అనావృష్టితో రైతుల ఆత్మహత్యలు: అసెంబ్లీలో పోచారం
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలకు గత రెండేళ్ల అనావృష్టి పరిస్థితులు కారణమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రైతు ఆత్మహత్యలపై, అనావృష్టి పరిస్థితులపై ఆయన మంగళవారం తెలంగాణ శాసనసభలో ఓ ప్రకటన చేశారు. విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు.
తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, గత రెండేళ్ల అనావృష్టి పరిస్థితులు, దశాబ్దాలుగా చిన్న నీటి పారుదల వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వంటి కారణాల వల్ల రైతులు దెబ్బ తిన్నారని ఆయన అన్నారు. రుణమాఫీలో సగం 8,336 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే సమకూరిచ్ందని ఆయన చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో 80 శాతం పంటలు దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు.
తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నప్పటికీ అనావృష్టి వల్ల రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచిందని చెప్పారు.
తాము అన్ని చర్యలను చేపడుతున్నామని చెబుతూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని చెప్పారు. రైతులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఒకేసారి రుణమాఫీ చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.