పసునూరి రవీందర్కు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు
న్యూఢిల్లీ: తెలంగాణ కథా రచయిత, జర్నలిస్టు పసునూరి రవీందర్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. తెలుగు కథల సంకలన విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ 23 భాషల్లో పురస్కారాలను ప్రకటించింది. అవుటాఫ్ కవరేజ్ ఏరియా అనే కథా సంకలనానికి ఈ అవార్డు వచ్చింది.
ఈ అవార్డు కింద ఆయనకు రూ.50 వేల నగదు బహుమతి, తామ్రపత్రం ఇస్తారు. త్వరలో అవార్డులు ప్రదానం చేస్తామని అకాడమీ కార్యదర్శి కే శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది యువ సాహితీ పురస్కారాల్లో కవితా సంకలనాలకు ప్రాధాన్యం లభించింది.
13 కవితా సంకలనాలు, మూడు నవలలు, ఆరు కథా సంకలనాలు, ఒక సాహితీ విమర్శ పుస్తకం అవార్డుకు ఎంపికయ్యాయి. కాగా, సంగీతం, వివిధ భాషల్లో ప్రాచీన మధ్యయుగ సాహిత్య రంగానికి సేవలందించిన ముగ్గురు సాహితీవేత్తలకు కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డులు ప్రకటించింది.
2013 సంవత్సరానికి కే మీనాక్షి సుందరం, 2014లో ఆచార్య మునీశ్వర్ ఝా ఎంపికయ్యారు. అకాడమీ జాబితాలో లేని భాష కుమౌనీ అభివృద్ధికి కృషి చేసిన చారుచంద్ర పాండే, మథురాదత్తు మథ్పాల్ సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపికయ్యారని అకాడమీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ పురస్కారం కింద వారికి రూ.లక్ష నగదు, తామ్రపత్రం బహుకరిస్తారు. సంయుక్తంగా ఎన్నికైన వారికి నగదు బహుమతి సమంగా పంచుతారు. కాగా, సాహితీవేత్త చొక్కాపు వెంకట రమణ సహా వివిధ భాషల్లో 12 మందికి బాల సాహిత్య పురస్కారం ప్రకటించింది. దీని కింద రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తారు.