గ్రేటర్ వరంగల్ కమిషనర్గా యువ ఐఏఎస్ శ్రుతి ఓజా
వరంగల్ అర్బన్ జిల్లాకు మరో యువ ఐఏఎస్ అధికారి వస్తున్నారు. మహా నగరపాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ అధికారి శ్రుతి ఓజాను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాకు మరో యువ ఐఏఎస్ అధికారి వస్తున్నారు. మహా నగరపాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ అధికారి శ్రుతి ఓజాను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం వికారాబాద్ సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. 2013 బ్యాచ్కు చెందిన వారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శిక్షణ ఐఏఎస్గా పనిచేశారు.
నెల రోజుల పాటు కార్పొరేషన్ పరిపాలనా వ్యవహారాలను తెలుసుకొన్నారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆస్తిపన్ను మదింపు విధానంపై బల్దియా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. శిక్షణ సమయంలోనే ఓజా చురుగ్గా, ఉత్సాహంగా పనిచేసిన పేరు ఉంది.
ఇంతకాలం కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అక్టోబరులో కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఇన్ఛార్జి కమిషనర్(పూర్తి అదనపు బాధ్యతలు)గా అదనపు కమిషనర్ షాహిద్ మసూద్ పనిచేస్తున్నారు. ఐదురోజుల క్రితమే మసూద్కు ఆర్డీగా పదోన్నతి లభించింది. ఓజా రెండు, మూడురోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.
ఐదో మహిళా ఐఏఎస్ అధికారిగా..
మహా నగరపాలక సంస్థ 12వ ఐఏఎస్ అధికారిగా శ్రుతి ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమె ఐదో మహిళా ఐఏఎస్ అధికారి కానున్నారు. 1995లో వరంగల్ పట్టణం పురపాలక సంస్థ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. తొలి కమిషనర్గా ఐఏఎస్ అధికారి శాలినీమిశ్రా నియమితులై విజయవంతంగా పనిచేశారు.
2005లో నీతూప్రసాద్ వచ్చారు. నగర ప్రజలతో మమేకమయ్యారు. 2006లో వచ్చిన స్మితా సబర్వాల్ పదినెలల పాటు పనిచేశారు. తొమ్మిది జంక్షన్లను అభివృద్ధి చేశారు. అవిభక్త జిల్లా కలెక్టర్గా పనిచేసిన వాకాటి కరుణ సైతం ఆరునెలల పాటు కమిషనర్గా పనిచేశారు.
పెరగనున్న దూకుడు..
అర్బన్ జిల్లాలో యువ ఐఏఎస్ అధికారుల దూకుడు పెరగనుంది. పాలన పరుగులు పెట్టే అవకాశాలుంటాయని అధికారులతో పాటు, ప్రజలు భావిస్తున్నారు. కలెక్టర్ ఆమ్రపాలి, గ్రేటర్ కమిషనర్ శ్రుతి ఓజాలు స్నేహితులే. కొత్త కమిషనర్ తన స్నేహితురాలని, బాగా పరిచయం ఉందని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. వరంగల్ మహా నగరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఐఏఎస్ కమిషనర్ను నియమించారని మేయర్ నరేందర్ తెలిపారు.