సినీ ఫక్కీలో చేజింగ్: రైలుని బైక్పై వెంబడించి బాలికను రక్షించిన ఎస్సై!
హైదరాబాద్: రైలును వెంబడించి, గిరిజన బాలిక బలవంతపు వివాహాన్ని ఆపిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు ఉదయం ఆరు గంటలకు చోటు చేసుకుంది. ఓ ఎస్సై స్వయంగా బైక్ పైన రైలును వెంబడించి ఆ బలవంతపు పెళ్లిని అడ్డుకున్నారు.
బుధవార ఉదయం బషీరాబాద్ ఎస్సై అభినవ చతుర్వేది నిద్రలో నుంచి ఓ ఫోన్తో లేచారు. ఓ బాలికను పెళ్లి పేరుతో గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నారని, వెంటనే రైల్వే స్టేషన్ వచ్చి అడ్డుకోవాలని ఫోన్లో ఓ మహిళ చెప్పింది. దీంతో ఎస్సై అభినవ సినీ ఫక్కీలో రైలును చేజ్ చేశారు.
ఫోన్ రాగానే అప్రమత్తమైన ఎస్సై వెంటనే రైల్వే స్టేషన్ వెళ్లారు. వచ్చేసరికి రైలు వెళ్లిపోయింది. ఎలాగైనా ఆ బాలికను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఎస్సై 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరు రైల్వే స్టేషన్కు ద్విచక్ర వాహనం పైన దూసుకెళ్లారు.
అప్పటికే తాండూరు రైల్వే స్టేషన్కు రైలు చేరుకుంది. ఎస్సై రైలు ఎక్కి బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక వయస్సు విజ్జి. డబ్బుల కోసం ఆమెకు చిన్న తనంలోనే పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
బషీరాబాద్ మండలం వాల్యానాయక్ తండాకు చెందిన శాంతిబాయి, సూర్యనాయక్ దంపతులకు ఆరుగురు కూతుళ్లు. ఓ కుమారుడు ఉన్నారు. నాలుగో కుమార్తె చౌహాన్ విజ్జిబాయిని గుజరాత్లో ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తే రూ.2 లక్షలు ఇప్పిస్తానని తల్లిదండ్రులకు ఒకరు చెప్పారు.
దీంతో వారు అంగీకరించారు. విషయం తెలిసిన జెండర్ టీం సభ్యురాలు హీరాబాయి ఇటీవల ఆ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలికకు పెళ్లి చేయమని వారి నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎస్సైకి సమాచార అందగా, ఆయన రైలును వెంబడించి బాలికను కాపాడారు.