మాయమాటలతో లొంగదీసుకున్నాడు: ఎస్సైపై యువతి ఫిర్యాదు
అదిలాబాద్: మాయమాటలు చెప్పి ఓ యువతిని లొంగదీసుకున్న ఎస్సై పైన అదిలాబాద్ జిల్లాలో కేసు నమోదయింది. జిల్లాలోని తాళ్లగురిజాల ఎస్సై అనిల్ తనను నమ్మించి మోసం చేశాడని పేర్కొంటూ ఓ యువతి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదైంది.
పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై పైన మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయిందని తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు కేసు విషయంలో ఆరా తీశారు. తాళ్లగురిజాల ఎస్సైపై కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని డీఎస్పీ రమణారెడ్డి ధ్రువీకరించారు.
సదరు ఎస్సై పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తనను లొంగదీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఇన్నాళ్లు పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, పెళ్లి గురించి అడగగానే ఇప్పుడు చేసుకోనని చెబుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
చిరుత సంచారం
మహబూబ్నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్తంగట్టు దగ్గర చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. చిరుత దాడిలో ఓ లేగ దూడ మృతి చెందింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపును ముమ్మరం చేశారు.
బాలిక అదృశ్యం
రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐశ్వర్య అనే పదిహేనేళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు ఓ యువకుడి పైన అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.