ఎస్సై మృతి వెనక కొత్త కోణం: భార్యకు సారీ అంటూ మెసేజ్ పెట్టి...
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దేముల్ మండలం కందనెల్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని ఎస్సై రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రమేష్ ఆత్మహత్యపై ఆయన కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రమేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి కుటుంబసభ్యులు చెప్పారు. ఎస్ఐ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి మహేందర్రెడ్డిని మృతుడి కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మృతదేహాన్ని తాండూరు ఏరియా ఆసుపత్రిలో ఉంచారు. గతంలో పెద్దేముల్ ఎస్ఐగా పనిచేసిన రమేష్ 8 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. రమేష్ స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లితండా. ఆత్మహత్య చేసుకునే ముందు ఎస్ఐ భార్యకు ఎస్ఎంఎస్ పంపిచాడని సమాచారం. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండు చేశారు.
ఎస్ఐ రమేష్ మృతికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారంనాడు భార్యతో కలిసి మార్కెట్కు వెళ్లిన ఎస్ఐ రమేష్ సెల్కు పలు కాల్స్ వచ్చాయని తేలింది. ఫోన్లో ఎస్ఐ కోపంగా మాట్లాడారని సమాచారం. వెంటనే ఓ పోలీసు అధికారి నుంచి ఫోన్కాల్ వచ్చింది.
ఆ ఫోన్కాల్ వచ్చిన అరగంట తర్వాత డ్యూటీకి వెళుతున్నానంటూ ఎస్ఐ బయటకు వెళ్లాడు. భార్యకు సారీ అంటూ మెసేజ్ పంపి తర్వాత ఓ కానిస్టేబుల్కు తాను ఉన్న ప్రదేశాన్ని ఎస్ఎంఎస్ చేశారు. కాగా రమేష్ మృతికి నిరసనగా తాండూరు చౌక్లో గిరిజన విద్యార్థులు ధర్నా చేశారు.
చిత్రహింసలు పెట్టి చంపారు
తన భర్తను హత్య చేశారని, పథకం ప్రకారం బయటకు పిలిపించి చిత్రహింసలకు గురిచేసి చంపారని మృతిచెందిన రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ భార్య గీత ఆరోపించారు. తన భర్త చావుకు కారణం రూరల్ సీఐ శివశంకర్నాయక్, టౌన్ సీఐ వెంకట్రామయ్య, పెద్దేముల్కు చెందిన లక్ష్మణ్నాయక్లు కారణమని ఆమె ఆరోపించారు.
తన భర్త మృతదేహంపై గాయాలున్నాయని అంటూ, ఆత్మహత్య చేసుకుంటే ఒంటిపై గాయాలు ఎందుకుంటాయని ఆమె ప్రశ్నించారు. తన భర్త మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
వృద్ధురాలి హత్య
హైదరాబాదు నగరంలోని అంబర్పేట ఎంసీహెచ్ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో సుగణ అనే వృద్ధురాలని హత్య చేసిన దుండగులు ఆమె ఒంటిపై ఉన్న నగలతో పరారయ్యారు. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ బుద్వేల్లో ఆర్టీసీ బస్సు- ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో తొమ్మిదో తరగతి చదువుతున్న సోహెల్ అనే విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.