స్వాతితో ఫోన్లో మాట్లాడి: కేసులో దెబ్బ!, పోలీసులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
నరేష్ హత్య, స్వాతి ఆత్మహత్య కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృషించిన విషయం తెలిసిందే.
భువనగిరి: నరేష్ హత్య, స్వాతి ఆత్మహత్య కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృషించిన విషయం తెలిసిందే.
ముంబైలో ఉన్న ఆ జంటను ఆత్మకూరు ఎస్సై శివనాగప్రసాద్ భువనగిరికి రప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయన స్వాతితో మాట్లాడిన కాల్ రికార్డింగులు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నరేష్-స్వాతి మృతిలో ట్విస్ట్: అలా చేస్తే కేసు మొత్తం తారుమారు!
అనంతరం నరేష్ కనిపించడం లేదంటూ అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని, సరైన విధానంలో దర్యాప్తు చేయని కారణంగానే నరేష్ మర్డర్ మిస్టరీగా మారిందని, తద్వారా స్వాతి ఆత్మహత్యకు పాల్పడిందని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు.
పోలీసులపై చర్యలు
ఈ క్రమంలో ఇంత తప్పిదానికి కారణమైన శివనాగప్రసాద్ను సస్పెండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే భువనగిరి పట్టణ, రామన్నపేట సీఐలు శంకర్, శ్రీనివాస్లకు ఛార్జ్ మెమో ఇచ్చారు.
భువనగిరి డిసిపి పివై గిరి, ఎసిపి మోహన్ రెడ్డికి కూడా మెమో జారీ చేశారు. మరో కేసులో సివిల్ తగాదాలో 40 వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన మోత్కూరు ఎస్సై రవి కుమార్ను సస్పెండ్ చేశారు.
స్వాతి తండ్రికి పోలీసు కస్టడీ
ఇదిలా ఉండగా, నరేష్ హత్య కేసులో నిందితులు శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డిలను అయిదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై బుధవారం భువనగిరి ఏడీఎం టి.నాగరాణి ఎదుట ఏపీపీ ఉపేందర్ వాదనలు వినిపించారు.
ఎల్బీ నగర్ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ
అనంతరం వారిని కస్టడీకి ఇస్తూ అనుమతించారు. గురువారం ఉదయం 10:30 గంటల నుంచి జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు పోలీసులు వారిని తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తారు. నరేష్ హత్య కేసులో ఎల్బీనగర్ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.
ఈ రోజు నుంచి పోలీసు కస్టడీకి
గత ఆదివారం నిందితులను నకిరేకల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వారిని గురువారం ఉదయం పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు.
స్వాతిని తండ్రే చంపాడా.. ఆ కోణంలో విచారణ
నరేష్ హత్య, స్వాతి ఆత్మహత్యపై ప్రజాసంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి ద్వారా కీలక విషయాలను పోలీసులు రాబట్టనున్నారు. స్వాతి ఆత్మహత్య చేసుకోలేదని శ్రీనివాస్ రెడ్డే పథకం ప్రకారం హత్య చేసుంటాడని ప్రజాసంఘాలు, నిజనిర్ధారణ కమిటీ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి, సత్తి రెడ్డిలను ఆ కోణంలోను విచారించనున్నారు.
తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
కాగా, యాదాద్రి జిల్లాలో జరిగిన స్వాతి ఆత్మహత్య, నరేష్ హత్యల పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
స్వాతి - నరేష్ల మృతిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ముగిసింది. ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఈ కేసును భువనగిరి కోర్టు విచారిస్తుందని పేర్కొంది.
తెలంగాణ పోలీలుసులు పారదర్శకంగా ఉండటం లేదని వ్యాఖ్యానించింది. పరువు హత్యలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై నమ్మకం సన్నగిల్లుతోందని పేర్కొంది.