బోయిన్పల్లి కిడ్నాప్ కేసు : విజయవాడ నుంచి 15 మంది గ్యాంగ్.. ప్లాన్ అమలుచేసింది అతనే..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూనే ఉంది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో సిద్దార్థ్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు తాజాగా వెల్లడైంది. భార్గవ్ రామ్,అఖిలప్రియ కిడ్నాప్కు ప్లాన్ చేసిన తర్వాత విజయవాడకు చెందిన సిద్దార్థ్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో సిద్దార్థ్ విజయవాడ నుంచి 15 మంది గ్యాంగ్తో హైదరాబాద్కి వచ్చి కిడ్నాప్కి పాల్పడినట్లు సమాచారం.
బౌన్సర్ గ్యాంగ్తో హైదరాబాద్కు సిద్దార్థ్..
విజయవాడలో సిద్దార్థ్ బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీని నడుపుతున్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియ,భార్గవ్ రామ్లకు అతను పర్సనల్ సెక్యూరిటీగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బోయిన్పల్లి కిడ్నాప్ కోసం అఖిలప్రియ,భార్గవ రామ్ సిద్దార్థ్ను సంప్రదించినట్లు సమాచారం. ఎవరిని కిడ్నాప్ చేయాలి... ఎక్కడ,ఎలా చేయాలన్న విషయాలు అఖిలప్రియ,భార్గవ్ రామ్లు సిద్దార్థ్ & గ్యాంగ్కి వివరించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అక్షయ్ కుమార్ సినిమాను చూపించి మరీ వారితో కిడ్నాప్ చేయించినట్లు ఇదివరకే అఖిలప్రియ పోలీసుల విచారణలో వెల్లడించింది.
ఆ ఐదుగురి కోసం పోలీసుల గాలింపు...
ప్రస్తుతం సిద్దార్థ్తో పాటు అతడి గ్యాంగ్లో 12 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. అఖిలప్రియ భర్త భార్గవ రామ్,మరో కీలక నిందితుడు గుంటూరు శ్రీను పరారీలో ఉన్నారు. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు.బెంగళూరు నుంచి భార్గవ్ రామ్,పుణే నుంచి గుంటూరు శ్రీను తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు. పోలీసులు దాడి చేస్తారన్న విషయం ముందే పసిగట్టి హోటల్స్ నుంచి జారుకున్నారు. భార్గవ్ రామ్ తల్లి కిరణ్మయి,సోదరుడు చంద్రహాస్లను కూడా కేసులో నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి కోసం కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఫోన్ కాల్ డేటా కోసం...
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఫోన్ కాల్ డేటాను పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. ఆమె సెల్ఫోన్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిడ్నాప్ సమయంలో ఆమె తన రెగ్యులర్ సెల్ఫోన్తో పాటు మరో ఫోన్ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి మూసాపేట సమీపంలోని లోధ అపార్ట్మెంట్ వరకు ఆమె రెండు సెల్ఫోన్లలో మాట్లాడుకుంటూ వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు అఖిలప్రియను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమె సెల్ఫోన్లు ఇంట్లోనే ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని కాల్ డేటాను విశ్లేషిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.