జయరాం హత్యకేసులో శిఖా చౌదరికి క్లీన్ చిట్.. 390 పేజీలతో పోలీసుల ఛార్జ్షీట్...
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఆయన మేనకోడలు శిఖా చౌదరికీ ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. జయరాం హత్యలో కార్మిక సంఘం నేత బీఎన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు చార్జ్షీట్లో స్పష్టం చేసిన పోలీసులు ఆయనను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
మహిళా కానిస్టేబుల్కు కూడా దిక్కులేదు.. హత్య చేసి, కాల్చేసిన ఉన్మాది.. వాడు కూడా కానిస్టేబులే..!
శిఖాకు క్లీన్ చిట్, 390 పేజీల చార్జ్షీట్
కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి తొలుత ఆయన మేనకోడలు శిఖా చౌదరిపై అనుమానాలు తలెత్తినా దర్యాప్తులో అవేవీ నిజాలు కాదని తేలడంతో పోలీసులు ఆమెకు క్లీన్చిట్ ఇచ్చారు. కేసుకు సంబంధించి పోలీసులు 390 పేజీల ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టుకు సమర్పించారు. అందులో పలు ఆసక్తికర విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 31న ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో జయరాం మృతదేహం లభించింది. తొలుత నందిగామ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించినా.. ఆ తర్వాతి పరిణామాలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
8 మంది అరెస్ట్
జయరాం హత్య కేసు దర్యాప్తు ప్రారంభించిన ఏసీపీ కేఎస్ రావు 8మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారికి సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక ఏసీపీపై ఉన్నతాధికారులు వేటు వేశారు. కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డి, జయరాంకు మధ్య వ్యాపార లావాదేవీల్లో వచ్చిన వివాదాలు తలెత్తాయి. ఇదే క్రమంలో సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డుల ఆధారంగా బీఎన్ రెడ్డి జనవరి 29, 30తేదీల్లో రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు కార్మిక సంఘం నాయకుడు బీఎన్ రెడ్డితో రాకేశ్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆయనకు హత్యలో ప్రమేయం ఉందన్న విషయాన్ని పోలీసులు చార్జ్షీట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
జయరాం హత్యలో పోలీసుల ప్రమేయం
కోర్టులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పోలీసుల ప్రమేయంపై ఆసక్తికర విషయాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రాంబాబు హత్య విషయం తెలిసీ సమాచారం ఇవ్వనందుకు ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చినట్లు సమాచారం. జయరాం మృతదేహాన్ని ఏపీకి తరలించాలని ఏసీపీ మల్లారెడ్డి చెప్పినట్లు ఆంధ్రా పోలీసులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తెలంగాణ పోలీసులు ఆయనను నిందితునిగా చేర్చినట్లు తెలుస్తోంది.