ఏజెన్సీలో నిశ్శబ్ద యుద్ధం .. మావోయిస్ట్ ల కట్టడికి పోలీసుల త్రిముఖ వ్యూహం
మావోయిస్టుల కట్టడికి పోలీసులు త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి అని భావిస్తున్న పోలీసులు ఎక్కడికక్కడ వారిని అణిచివేసేందుకు రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న అటవీ ప్రాంతంలో, ప్రస్తుతం మావోయిస్టులు పోలీసుల మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధంలో గిరిజన గూడేలు భయం గుప్పెట్లో మగ్గుతున్నాయి.
షాకింగ్ .. ప్రజా కోర్టు నిర్వహించి మరీ సొంత కమాండర్ ను హతమార్చిన మావోయిస్ట్ లు
మావోల కట్టడికి రంగంలోకి దిగిన పోలీస్ బాస్
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు బాగా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ లకు కూడా పాల్పడుతున్నారని గుర్తించిన పోలీసులు ఆదిలోనే వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. చత్తీస్ గడ్ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో మావోలు తెలంగాణా రాష్ట్రంలోకి వచ్చారన్న సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మావోయిస్టుల కట్టడికి పక్కా ప్లాన్ తో దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులు డీజీపీ మహేందర్ రెడ్డి మకాం వేయడం వెనుక మావోలను కట్టడి చేసే స్కెచ్ ఉన్నట్టు సమాచారం .
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర హోం శాఖ సమీక్ష
ఇటీవల ములుగు జిల్లా వెంకటాపూర్ లో కేంద్ర హోం శాఖ, సిఆర్పిఎఫ్, చత్తీస్ గడ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం కూడా మావోల అలజడి నేపధ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది . ములుగు , కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న సమర్ధులైన పోలీసులను ఏరియా డామినేషన్ పార్టీ ఏడీపీ లుగా గ్రేహౌండ్స్ తో నిమిత్తం లేకుండా నిత్యం వాళ్ళే అడవుల్లో కూంబింగ్ చేసేలా తీర్చిదిద్దనున్నట్లుగా సమాచారం.
10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్న పోలీసులు
అంతేకాకుండా పోలీస్ శిక్షణ సంస్థ నుంచి ఈనెల 7వ తేదీన పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ ను బయటకు రానుండడంతో వారితో 10 ప్రత్యేక బృందాలను తయారు చేసి రంగంలోకి దించే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డ్రోన్ల సహాయంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్న పోలీసులు మావోయిస్టుల కట్టడం కోసం అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు.
భయం గుప్పిట్లో ఏజెన్సీ
గ్రేహౌండ్స్ దళాల తో పాటుగా, 10 ప్రత్యేక బృందాలను, అలాగే ఏరియా డామినేషన్ పార్టీలను సిద్ధం చేసి మావోయిస్టుల ఏరివేతకు పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. దీంతో ఇంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో అలజడి మొదలైంది. పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలతో ఏజెన్సీ ప్రాంతాలు భయం గుప్పిట్లో మగ్గుతున్నాయి. అడుగడుగునా తనిఖీలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు . ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఉన్నారు.