జుడాల నిరాహార దీక్షలు, ప్రభుత్వానికి హెచ్చరిక
హైదరాబాద్: కోఠి మెడికల్ కళాశాలలో జూడాల దీక్షలు శనివారం కూడా కొనసాగాయి. తెలంగాణ జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సంవత్సరం గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు విధులు నిర్వహించాలనే ప్రతిపాదనను రద్దు చేసేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు.
అవసరమైతే నిరవధిక నిరాహారదీక్షకు సైతం సిద్ధమేనని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య మంత్రి రాజయ్య అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలుసుకున్నారన్నారు.
సిమి మాజీ అధ్యక్షుడి మృతి
నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి మాజీ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దిన్(45) దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో శుక్రవారం అర్థరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో సలావుద్దీన్ మరణించాడు. శుక్రవారం రాత్రి నల్లగొండలో అస్ఘర్ అలీ అనే వ్యక్తి వివాహా కార్యక్రమానికి హాజరైన సలావుద్దీన్, హైదరాబాద్కు తిరిగి వెళుతుండగా ముందు వెళ్తున్న గుర్తు తెలియని లారీని ఓవర్ టేక్ చేయబోతూ ఆయన కారు దానిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సలావుద్దీన్, స్వల్పంగా గాయపడిన కారు డ్రైవర్ షోయబ్లను అంబులెన్స్లో హైదరాబాద్ సన్రైజ్ ఆస్పత్రికి తరలిస్తుండగా సలావుద్దిన్ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న సలావుద్దీన్ బంధువులు, అనుచరులు శవాన్ని పోస్టుమార్టం చేయకుండా సిబ్బందిని బెదిరించి స్వగృహానికి తరలించారు.
దీంతో చిట్యాల పోలీసులు సలావుద్దిన్ ఇంటికి వెళ్లి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా, ముస్లింలకు అన్యాయం జరుగుతోందన్న భావనతో సలావుద్దిన్ తీవ్రవాద సంస్థలతో చేతులు కలిపినట్లు ఆయన సమీప బంధువు ఒకరు వెల్లడించారు.
సలావుద్దీన్ తల్లిదండ్రులు నల్లగొండలో నివాసముంటున్నారు. తండ్రి జమాలుద్దిన్ పరిశ్రమల శాఖలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేసి పదవీ విరమణ చేయగా, తల్లి మహముదున్నీసా ప్రభుత్వ ఉపాధ్యా యురాలుగా పదవీ విరమణ పొందారు.
ముస్లిం పిల్లలు బాగా చదువుకోవాలన్న యోచనతో సలావుద్దీన్ తల్లిదండ్రులు వారింట్లోని సగభాగంలో ఉర్దూ పాఠశాలను ఏర్పాటు చేయగా దానికి ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. సలావుద్దీన్ హైదరాబాద్ ఉప్పుగూడలో నివాసం ఉంటు న్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాగా, సలావుద్దీన్ దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో విధ్వంసానికి కుట్రదారుడు. గతంలో ఇతను సిమి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. హైదరాబాదులో సిమి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలోనే సలావుద్దీన్ లష్కరే తోయిబాతోను సంబంధాలు కొనసాగించాడు. ఇతని పైన పలు కేసులు ఉన్నాయి.