గోపీచంద్కు షాక్పై అలీ వివరణ, సింధు పరిపూర్ణ క్రీడాకారిణి కాదన్న కోచ్
హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో రజతం గెలిచిన పీవీ సింధును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆమెకు గ్రాండ్ వెల్కం చెప్పారు.
మంగళవారం నాడు ఏపీలోను ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక విమానంలో అతిథి హోదాతో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆమెను తీసుకు వెళ్లనున్నారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం సన్మానం చేస్తారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణా హారతిలో పాల్గొంటారు.
ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు సింధు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు మంత్రులు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, క్రీడాభిమానులు సింధుకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. సింధు వచ్చే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించేందుకు మంచి కోచ్ను చూస్తామన్నారు. దీనిపై విమర్శలు రావడంతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది.
అంతర్జాతీయ కోచ్లు అయితే తెలంగాణ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం ఉంటుందనే భావనతో ఉప ముఖ్యమంత్రి అలా వ్యాఖ్యానించారని, అంతే తప్ప గోపీచంద్కు వ్యతిరేకంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ఘన స్వాగతం
పీవీ సింధుకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువు గోపీచంద్తో కలిసి హైదరాబాద్ తిరిగొస్తున్న సింధు కోసం ఉదయ నుంచే తల్లిదండ్రులు విజయ, రమణ, కుటుంబ సభ్యులతోపాటు పలువురు విమానాశ్రయంలో వేచి చూశారు.
బయటకు రాగానే..
సింధును స్వాగతించేందుకు విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్లో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, శాప్ ఛైర్మన్ మోహన్ ఉదయం ఎనిమిది గంటలకే అక్కడికి చేరుకున్నారు.
నేతల క్యూ
అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ, మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, మాజీ ఎంపీ వి హన్మంతరావు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్నాథ్ తదితరులు వచ్చారు.
కిటకిట
పలువురు క్రీడాకారులు, విద్యార్థులు తరలిరావడంతో టెర్మినల్ కిటకిటలాడింది. స్వాగత వేడుకను వీక్షించేందుకు అక్కడ రెండు తెరలను ఏర్పాటు చేశారు.
అభినందనలు
ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సింధు, గోపీచంద్ టెర్మినల్ నుంచి బయటకు రాగానే మంత్రులతోపాటు అంతా వారిని అభినందనలతో ముంచెత్తారు. పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు.
ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సు
అనంతరం పూలతో అలంకరించిన ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులో ర్యాలీ ప్రారంభమైంది. మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వాహనం పైనే వెళ్లారు.
ర్యాలీ
ర్యాలీ విమానాశ్రయం నుంచి బెంగళూరు జాతీయ రహదారిపైకి వచ్చి శంషాబాద్, గగన్పహాడ్, అరాంఘర్, మెహిదీపట్నం, లంగర్హౌస్, టోలీచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియానికి చేరింది.
ప్రత్యేక వేదికలు
మార్గమధ్యంలో పలుచోట్ల స్థానికులు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి సింధుకు ఘనస్వాగతం పలికారు. రోడ్షో జరిగినంతసేపు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేశారు.
అమ్మాయిల్ని ప్రోత్సహిస్తే..
క్రీడలలో అమ్మాయిలకు సరైన ప్రోత్సాహం లభిస్తే సత్తాచాటుతారని బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. క్రీడాకారిణుల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని చెప్పింది.
కోచ్, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు
కోచ్ గోపీచంద్, నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. గోపీచంద్ వల్లే నేనీ స్థాయిలో ఉన్నానని, నాకంటే ఒలింపిక్స్ పతకం కోసం అతడే ఎక్కువ శ్రమించాడని,. తల్లితండ్రుల నుంచి నాకు ఎంతో ప్రోత్సాహం లభించిందని, వారు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారని సింధు చెప్పింది.
భరతమాత ముద్దుబిడ్డ
ఈ రోజు నన్నంతా భారత ముద్దు బిడ్డ అంటున్నారంటే అందుకు ప్రధాన కారణం నా తల్లిదండ్రులే అన్నది. ఒలింపిక్స్లో భారత్ తరఫున ఇద్దరమ్మాయిలు పతకాలు సాధించడం గొప్ప ఘనత అని చెప్పింది.
అమ్మాయిలది కష్టపడే మనస్తత్వం
అమ్మాయిలది స్వతహాగా కష్టపడే మనస్తత్వమని, వారికి తల్లిదండ్రుల మద్దతు ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని తెలిపింది.
బ్యాడ్మింటనే కాదు..
బ్యాడ్మింటన్ ఒక్కటే కాదని, సరైన ప్రోత్సాహం లభిస్తే ఏ క్రీడలోనైనా అమ్మాయిలు పతకాలు తెస్తారని, భారతీయురాలిగా ఒలింపిక్స్ పతకం గెలిచినందుకు గర్విస్తున్నానని చెప్పింది.
ఆనందం ఎంతో
ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని, పతకంపై కాకుండా సత్తా మేరకు ఆడాలన్న లక్ష్యంతో ఒలింపిక్స్ బరిలో దిగానని సింధు తెలిపింది.
పక్కా ప్రణాళికతో
రియో వెళ్లడానికి రెండు నెలల ముందు నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నానని, పతకం ఖాయమని ముందే భావించలేదని, ఐతే ప్రతి మ్యాచ్లో ప్రణాళిక ప్రకారం ఆడి ఫలితాలు సాధించానని చెప్పింది.
సింధు భారతీయురాలు
సింధు భారతీయురాలని ఆమె విజయాన్ని దేశమంతా ఉత్సవంగా జరుపుకుంటోందని బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు.
అందరూ అభినందించారు
సింధు ఏ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారిణి అన్న అంశంపై ఎక్కువగా చర్చ నడుస్తోందని ఓ విలేకరి సింధును ప్రశ్నించగా.. ఆమె భారతీయురాలని గోపీచంద్ స్పందించాడు.
పీవీ సింధు భారత్ సొంతం
'సింధు భారతీయురాలని, ఆమె భారత్ సొంతమని, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు ఆమెకు మద్దతుగా నిలుస్తుండడం శుభసూచకమని గోపీచంద్ అన్నారు.
క్రీడలు జాతి సమగ్రతకు ప్రతిరూపం
క్రీడలు జాతి సమగ్రతకు ప్రతిరూపమన్నారు. సింధు గెలిచినందుకు భారత్ మొత్తం ఆనందించిందని, అందరూ సంబరాలు చేసుకున్నారని గోపీచంద్ అన్నారు.
వీరి పాత్ర కూడా
రియో ఒలింపిక్స్కు అత్యుత్తమంగా సన్నద్ధమయ్యామని, తనతో పాటు ఫిజియో కిరణ్, అథ్లెటిక్స్ కోచ్ రమేశ్లు సింధు విజయం కోసం తమ పూర్తి శక్తియుక్తుల్ని ధారపోశారన్నారు.
ఖలేజా కావాలి
ఒలింపిక్స్లో పతకం గెలవాలంటే ఆట ఒక్కటే సరిపోదని, ఖలేజా కూడా కావాలన్నారు. అద్భుతమైన ఆట సింధు సొంతమని, అంకితభావంలో ఒక్క శాతం లోపం కూడా లేదన్నారు.
పరిపూర్ణ క్రీడాకారిణి కాలేదు
మిగతా వాళ్ళకు సింధుకు అదే తేడా అని, ఆమె ఇంకా పరిపూర్ణ క్రీడాకారిణి కాలేదన్నది తన అభిప్రాయమన్నారు. ఆమె ఇంకా అత్యుత్తమంగా ఆడగలదన్నారు.
ఇంకా సమయం పడుతుంది
తన పూర్తిస్థాయి సత్తా తెలిసేందుకు పీవీ సింధుకు మరికొంత సమయం పడుతుందని గోపీచంద్ అన్నారు. త్వరలోనే భారత్ క్రీడల దేశంగా మారుతుందని గోపీచంద్ అన్నారు.