ప్రియురాలి ధర్నా: ప్రియుడి ఆత్మహత్యాయత్నం
ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడు రజనీకాంత్ ఇంటి ఎదుట ప్రియురాలు సింధు ధర్నాకు దిగింది. అయితే ప్రియురాలు ధర్నా చేయడంతో ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.
పెద్దపల్లి: ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది.అయితే ప్రియురాలు తన ఇంటి ముందు ధర్నాకు దిగిన విషయం తెలుసుకొన్న ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకొంది.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన బుద్ది సింధు, మంథని మండలం మైదుపల్లికి చెందిన రజనీకాంత్ కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు.అయితే పెళ్ళి చేసుకొంటానని నమ్మించి రజనీకాంత్ తనన మోసం చేశాడని బాధితురాలు సింధు ఆరోపిస్తోంది. ఈ మేరకు ప్రియుడు రజనీకాంత్ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.
పదో తరగతి స్నేహితుల ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని బాధితురాలు సింధు చెబుతున్నారు. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించారు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని సింధు అంటున్నారు. అయితే పెళ్లిగురించి మాట్లాడితే కాదు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
2016 జూన్ 3న జరిగిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మైదుపల్లి గ్రామానికి చెందిన రజనీకాంత్తో సింధుకు పరిచయం ఏర్పడింది. సింధు అప్పటికే హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేస్తుండగా, రజనీకాంత్ గోదావరిఖనిలో డిప్లొమా చేస్తున్నాడు.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని దీంతో రెండు నెలల క్రితం మంథని సీఐని ఆశ్రయించానని గత్యంతరం లేక ప్రియుడి ఇంటి ముందు బైఠాయించానని కన్నీటి పర్యంతమైంది సింధు. ఈ క్రమంలో రజనీకాంత్తో పాటు ఆయన తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానని..చావైనా..బతుకైనా ప్రేమించినవాడితోనేనని యువతి పేర్కొంది.
తన కూతురు జీవితంతో ఆడుకు న్న యువకుడితోనే పెళ్లి చేయాలని యువతి తల్లిదండ్రులు ఓదమ్మ, మొగిలయ్య ఆవేదన చెందారు. యువతికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మహిళలు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని సింధు ప్రియుడి ఇంటిముందు ఆందోళనకు దిగగా..మనస్థాపం చెందిన రజనీకాంత్ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి మంథని సామాజిక వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్సచేసి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు.