కేసీఆర్ దగా!?: సింగరేణిలో 'వారసత్వం' సంగతి అంతేనా!
వారసత్వ ఉద్యోగాల హామి నెరవేరకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల సింగరేణి కార్మికుల్లో అసంతృప్తి పేరుకుపోవడం ఖాయం. ఇదే గనుక జరిగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీపై దీని ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది.
హైదరాబాద్: ఏళ్లుగా శ్రమను నమ్ముకుని భూతల్లి ఒడిలో చెమటోడుస్తున్న చీకటి సూరీలను 'వారసత్వ ఉద్యోగాల' బెంగ వేధిస్తోంది. బొగ్గుబావుల్లో నిరంతరం ప్రమాదాల అంచున.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వారు చేస్తున్న శ్రమకు తగిన గౌరవం తగ్గడం లేదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
బొగ్గు గనిలో పని నిత్యం సవాళ్లతో కూడుకున్నది. ఏళ్ల పాటు చేసే సర్వీసులో ఎన్నో అనారోగ్యాల బారినపడి.. రిటైర్మెంట్ దశలో అనారోగ్యాలకు గురై కకావికలమైన కుటుంబాలెన్నో. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికే అప్పట్లో వారసత్వ ఉద్యోగాల పరంపర మొదలైంది. కుటుంబ పెద్ద స్థానంలో కొడుకులకు లేదా అల్లుళ్లకు వారసత్వంగా ఉద్యోగాన్ని ఇచ్చుకునే అవకాశాన్ని నాటి ప్రభుత్వాలు కల్పించాయి.
చంద్రబాబు సర్కార్ రద్దు చేసింది:
1999లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు రద్దయిపోయాయి. ఇన్నేళ్లకు తెలంగాణ రాష్ట్రం సాధించుకుని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఇచ్చిన హామితో వారిలో ఆశలు చిగురించాయి. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయడంతో అందరిలోను సంబరాలు మొదలయ్యాయి.
హైకోర్టుతో తీర్పుతో ఊహించని దెబ్బ:
వారసత్వ ఉద్యోగాలపై కార్మికుల్లో సంబరాలు మొదలయ్యాయో లేదో ఇంతలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి వారసత్వ ఉద్యోగాలను నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో.. దీనికి బ్రేక్ పడింది. ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు వారసత్వ ఉద్యోగ ప్రకటన రద్దు చేయాలని తీర్పునిచ్చింది. దీంతో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు డైలామాలో పడ్డారు. వారసత్వ ఉద్యోగాల వల్ల తాము 30వేల ఉద్యోగాలు కోల్పోతున్నామని, పిటిషన్ లో సతీష్ కుమార్ పేర్కొన్నారు.
కార్మిక కుటుంబాల్లో తీవ్ర ఆందోళన:
మొత్తం మీద వస్తాయనుకున్న ఉద్యోగాలు సందిగ్దంలో పడిపోవడంతో కార్మిక కుటుంబాల్లో అలజడి నెలకొంది. చాలామంది ఇప్పటికే కట్నాలకు బదులు పని ఇస్తామన్న హామితో పెళ్లిళ్లు జరిపించినవారున్నారు. అలాగే వారసత్వ ఉద్యోగాలు ఖాయమవడంతో.. చాలామంది లక్షలు కట్నాలుగా ఇచ్చి కూతుళ్ల పెళ్లిళ్లు చేసినవారు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు తలలు పట్టుకున్న పరిస్థితి.
భారీ ఓటు బ్యాంకు..
వారసత్వ ఉద్యోగాల హామి నెరవేరకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల సింగరేణి కార్మికుల్లో అసంతృప్తి పేరుకుపోవడం ఖాయం. ఇదే గనుక జరిగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీపై దీని ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే వీరి ఓటు బ్యాంకు లక్షల్లో ఉంటుంది. పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం,జిల్లాల్లో కార్మికుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. వారసత్వ ఉద్యోగాల కల్పన విషయంలో గనుక ప్రభుత్వం విఫలమైతే అది టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ లాంటిదే.
కోదండరాంపై విమర్శలు:
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దీనికి ఎలాంటి పరిష్కారం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోదండరాంపై విమర్శలు గుప్పిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వారసత్వ ఉద్యోగాల రద్దు వెనుక కోదండరాం కుట్ర ఉందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు:
అటు
కాంగ్రెస్
పార్టీ
సైతం
ప్రభుత్వ
వైఫల్యాన్ని
గట్టిగానే
నిలదీస్తోంది.
వారసత్వ
ఉద్యోగాల
కల్పనలో
కేసీఆర్
సర్కార్
విఫలమైందని
పీసీసీ
అధ్యక్షుడు
ఉత్తమ్
కుమార్
ఆరోపిస్తున్నారు.
కేసీఆర్
కు
చిత్తశుద్ది
లేకపోవడం
వల్లే
జీవో
అమలు
కాలేదని
విమర్శించారు.
త్వరలో
జరిగే
కార్మిక
ఎన్నికల్లోను
దీని
ప్రభావం
ఉండే
అవకాశం
ఉండటంతో
కాంగ్రెస్
బలపడేందుకు
ప్రయత్నిస్తోంది.
ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి మిగిలిన కార్మిక సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. ఓపెన్ కాస్టుల విషయంలోను, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలోను కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని వారు విమర్శిస్తున్నారు. సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య సమస్యల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతిని ఏర్పాటు చేస్తామన్న హామిని కూడా నిలబెట్టుకోలేదన్నారు.
సింగరేణి సమస్యలపై సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని వేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ ప్రకటించారు.
సమ్మె బాటలో కార్మికులు:
వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పు తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న కార్మికులు సమ్మె ద్వారానే తమ డిమాండ్ ను సాధించుకోవాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారంలో కార్మికులు సమ్మెకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె జరిగితే రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవు, ఎటు తిరిగి ప్రభుత్వానికి ఇది నష్టం చేకూర్చే చర్య. చూడాలి మరి దీనికి అంతిమ పరిష్కారం ఏమిటో!