దేశంలో No.1 గా సింగరేణి.. స్వరాష్ట్రంలో అభివృద్ధి అమోఘం : సీఎండీ
హైదరాబాద్ : నల్లబంగారం సిరులు కురిపిస్తోంది. ప్రొడక్షన్ లోనే కాదు వేల్ఫేర్ లోనూ దూసుకెళుతోంది. ఉద్యోగుల క్షేమం కోరుతూ ముందుకు సాగుతున్న సింగరేణి దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత సింగరేణిలో అనేక మార్పులు వచ్చాయని.. అనూహ్య అభివృద్ధి జరిగిందని అంటున్నారు సీఎండీ శ్రీధర్. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రోత్సాహం, సహాకారంతో సింగరేణి జాతీయస్థాయికి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సింగరేణి కార్మికులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు శ్రీధర్. కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు కలిసికట్టుగా సమష్టి స్ఫూర్తితో పనిచేసుకుంటూ ముందుకెళితే సింగరేణి మరిన్ని విజయాలు సాధించడం ఖాయమని ఆకాంక్షించారు. సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి రాష్ట్రానికి 22 వేల 500 మిల్లీ యూనిట్లు కరెంట్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. 50 వేల కోట్ల రూపాయల అమ్మకాలు సాగించే దిశగా సింగరేణిని ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఇలాకాపై బీజేపీ, కాంగ్రెస్ కన్ను.. మరి టీఆర్ఎస్ పరిస్థితి.. ఇంతకు 2023 ఎవరిది?
ప్రొడక్షన్లోనే నెంబర్ వన్ కాదు.. వేల్ఫేర్లోనూ దేశంలోనే టాప్ గా నిలిచింది. జాతీయ స్థాయిలో నెంబర్ వన్ పొజిషన్ సొంతం చేసుకోవడం గర్వకారణమంటున్నారు శ్రీధర్. ఈ ఐదేళ్లలో 281.9 శాతం లాభాలు.. 116.5 శాతం అమ్మకాల్లో వృద్ధిరేటు సాధించినట్లు చెప్పుకొచ్చారు.
సింగరేణిలో ఇదివరకు 419 కోట్ల రూపాయలుగా ఉన్న లాభాలను ఈ ఐదేళ్ల కాలంలో ఉరుకులు పెట్టించామని చెబుతున్నారు. అది కాస్తా 1600 కోట్ల రూపాయలకు చేరిందని హర్షం వ్యక్తం చేశారు. అమ్మకాల్లో కూడా గణనీయమైన వృద్ధి సాధించినట్లు తెలిపారు. 11 వేల 928 కోట్ల రూపాయల నుంచి ఏకంగా 25 వేల 828 కోట్లకు అమ్మకాలు రీచ్ అయినట్లు చెప్పారు.