గాయని మధుప్రియ కిడ్నాప్ యత్నం: నేడు ప్రియుడితో వివాహం
ఆదిలాబాద్: గాయని మధుప్రియ అపహరణకు విఫలయత్నం జరిగింది. ఆమె శుక్రవారం ప్రియుడు శ్రీకాంత్ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కిడ్నాప్ యత్నం నుంచి తప్పించుకుని మధుప్రియ ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ చేరుకుంది.
ప్రస్తుతం మధుప్రియ, ఆమె ప్రియుడు శ్రీకాంత్ పోలీసు స్టేషన్లో ఉన్నారు. బంగి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. గత రెండున్నరేళ్లుగా వారిరువురి మధ్య ప్రేమవ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వివాహాన్ని మధుప్రియ తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
గత ఐదు రోజులుగా కాగజ్నగర్లోనే మధుప్రియ ఉంటోంది. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు కాగజ్నగర్ వాసవీ గార్జెన్లో ఆమె వివాహం జరగనుంది. అయితే తన వివాహానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారని మదు ప్రియ చెప్పింది.
నవంబర్ 2వ తేదీన హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆహ్వానించనున్నట్లు మధుప్రియ చెప్పింది. బండి శ్రీకాంత్ హైదరాబాదులోని న్యూనల్లకుంటలో నివాసం ఉంటున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మధు ప్రియ గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆడపిల్లనమ్మా అనే పాట ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.