ప్రేమ అంటేనే ఇబ్బంది, ప్రేమికుడ్ని వదలుకోలేం: 'హైడ్రామా'పై మధుప్రియ, 2న రిసెప్షన్
హైదరాబాద్: గాయని మధుప్రియ, శ్రీకాంత్ ప్రేమ వివాహం ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లోని వాసవీ గార్డెన్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల పైన మధుప్రియ మాట్లాడారు. అంతా కూల్ అని, వివాహం హాయిగా జరిగిందన్నారు.
కల్యాణ మండపంలో వివాహం సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి ప్రేమ కథలో ఇబ్బందులు సహజమే అన్నారు. ప్రేమ అంటేనే ఇబ్బందులు ఉంటాయన్నారు. అలాగే తన ప్రేమ కథలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇబ్బందులొచ్చాయని ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేము కదా అని ప్రశ్నించారు. బయటకి చెప్పుకోలేని కొన్ని సమస్యలూ ఉన్నాయని, ఇప్పుడంతా కూల్ అన్నారు. వివాహానికి తన తల్లిదండ్రులు అంగీకరించారన్నారు. రెండు సంవత్సరాలుగా తనకు శ్రీకాంత్ తెలుసునని చెప్పారు. నవంబర్ 2న హైదరాబాదులో రిసెప్షన్ ఉంటుందన్నారు.
శుక్రవారం ఉదయం నుంచి... నాటకీయ పరిణామాల మధ్య మధుప్రియ వివాహం జరిగింది. మధుప్రియ, కాగజ్ నగర్కు చెందిన శ్రీకాంత్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రేమ వివాహానికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు.
అయినప్పటికి పెళ్లి చేసుకోవాలని మధుప్రియ, శ్రీకాంత్ నిర్ణయించుకున్నారు. వీరు ఇద్దరు శుక్రవారం ఉదయం కాగజ్ నగర్లో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం అర్దరాత్రి మధుప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కాగజ్ నగర్కు వాహనాల్లో వచ్చి మధుప్రియను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు.
ప్రియుడి తరఫు బంధువులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన కాగజ్ నగర్ పోలీసులు ఇద్దరూ మేజర్లు కావడంతో మధుప్రియ తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని మధుప్రియ చెప్పింది. అనంతరం వివాహం జరిగింది.
కాగజ్ నగర్లో వరుడు శ్రీకాంత్ తరపు బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం జరిగింది. మధుప్రియ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వివాహానికి దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఉదయం మధుప్రియ తల్లిదండ్రులు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు కాగజ్నగర్ రూరల్ సీఐ రమేశ్బాబు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.