రాజయ్య కంటతడి: రాత్రి హెచ్చరించిన కోడలు, గ్యాస్ లీక్ చేసిందెవరు?
వరంగల్: వరంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య కోడలు సారిక, పిల్లలు మృతి కేసులో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కోడలు సహా ముగ్గురు మనవరాళ్లు మృతి చెందిన నేపథ్యంలో రాజయ్య కన్నీరుమున్నీరు అవుతున్నాడని అంటున్నారు.
రాజయ్య నివాసంలోని మొదటి అంతస్థులో ప్రమాదం జరిగింది. మొదటి అంతస్థు నుంచి ఉదయం 6.30 గంటల వరకు కూడా పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
సారిక గ్యాస్ లీక్ చేసిందా, మరెవరైనా చేశారా?
సారిక, ముగ్గురు పిల్లల మృతికి గ్యాస్ లీక్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే గ్యాస్ లీక్ చేసింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. గ్యాస్ సారికనే లీక్ చేసుకుందా? లేక ఎవరైనా వచ్చి లీక్ చేశారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
బెడ్ రూంలో గ్యాస్ లీక్ కావడం ఏమిటి?
గ్యాస్ బెడ్ రూంలో లీకైంది. దీంతో, గ్యాస్ లీక్ అయితే వంట గదిలో కావాలని, బెడ్ రూంలో లీక్ కావడం ఏమిటనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బెడ్ రూంలో రెండు సిలిండర్లు ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజయ్యకు, కోడలు సారికకు మంగళవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలో తాను మళ్లీ ఆందోళన చేస్తానని సారిక హెచ్చరించినట్లుగా సమాచారం.
వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అంశంపై సమాలోచనలు
రాజయ్య ఇంట్లో ఘటనపై కాంగ్రెస్ నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై కాంగ్రెస్ నేతలతో వాపోయిన రాజయ్య... ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని చెప్పారు.