సిరిసిల్లకు ఇక బ్రాండ్ ఇమేజ్.. కొత్త టెక్నాలజీతో పట్టు చీర
సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇకపై బ్రాండ్ ఇమేజ్ దక్కనుంది. కొత్త టెక్నాలజీతో సరికొత్తగా రూపొందిస్తున్న పట్టు చీర సిరిసిల్ల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనుంది. ఇదివరకు మగ్గాలపై నేసిన చీరలను ఇప్పుడు జకార్డ్ యంత్రం ఉపయోగించి కొత్త వన్నెలు అద్దుతున్నారు. చంద్రంపేట గ్రామంలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో క్వాలిటీ చీరలు రూపుదిద్దుకోవడం విశేషం. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ పద్దతికి నాంది పలికిన ఇక్కడి నేతన్నలు భవిష్యత్తులో సిరిసిల్ల పేరును ఖండంతరాలు దాటించనున్నారనేది అతిశయోక్తి కాదు.
మరమగ్గాలకు జకార్డ్ యంత్రం తోడైతే.. నేతన్నల పని సులువు
బతుకుబండి సాగక పట్టు దారాలు ఉరి కొయ్యలుగా మారి ఎందరో నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చేతి వృత్తి బతికే దారి చూపించలేక మరెందరో నేతన్నలు ఆత్మహత్యలకు ఒడిగట్టారు. ఆ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో చేయడానికి పని దొరికి ఆకలి చావులు దూరమయ్యాయి. ఈ క్రమంలో ఆధునికతను అంది పుచ్చుకుని సరికొత్త డిజైన్లు తయారు చేస్తూ చేనేత వృత్తికి మరింత వన్నెలు అద్దుతున్నారు. మరమగ్గాలకు జకార్డ్ యంత్రాన్ని అమర్చి కొత్త కొత్త డిజైన్లలో చీరెలను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తరపున ఇచ్చే బతుకమ్మ చీరెలను ఈ యంత్రంపై మరింత ఆకర్షణీయంగా తయారు చేయొచ్చు.
ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్లో అపర చాణక్యుడు..!
కావాల్సిన డిజైన్లు సులభంగా ప్రింట్
మొమరీ కార్డులో కావాల్సిన డిజైన్లు లోడ్ చేసి ఈ యంత్రానికి అనుసంధానిస్తే చాలు.. కావాల్సిన విధంగా అన్నీ రకాల చీరెలు, టవల్స్, కార్పెట్లు తదితర వస్త్రాలు ఆకర్షణీయంగా ప్రింట్ అవుతాయి. ఎప్పటికప్పుడు డిజైన్లు మార్చుకునే వెసులుబాటు ఈ యంత్రానికి ఉంటుంది. మీట నొక్కితే చాలు డిజైన్ మారిపోతుంటుంది. అతి తక్కువగా కేవలం 640 హుక్కులతో రూపుదిద్దుకున్న ఈ మినీ ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రం ఎవరైనా సరే సులభంగా ఆపరేట్ చేయొచ్చు. దీని మరో ప్రత్యేకత ఏంటంటే.. వై ఫై సౌకర్యం కూడా ఉండటం. 240 RPM స్పీడ్తో నడిచే ఈ మెషీన్ ద్వారా సులువుగా వస్త్రాలపై ప్రింట్ చేసే వీలుంది.
ఈ యంత్రంపై బతుకమ్మ పండుగ చీరలు
ఆధునిక టెక్నాలజీని పుణికిపుచ్చుకున్న జకార్డ్ యంత్రాన్ని రాష్ట్రానికి తొలిసారిగా చంద్రంపేటలోని నేత కార్మికుడు నర్సింహ స్వామి బెంగళూరు నుంచి తెప్పించారు. ఇప్పటికే చీరలు నేయడానికి తాను వాడుతున్న మరమగ్గాలకు దీన్ని అమర్చి చీరెలు నేస్తున్నారు. మొన్నటి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన చీరలు ఈ యంత్రం సాయంతో రూపొందించడం విశేషం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి యంత్రాలు వాడుతున్నట్లు తెలుస్తోంది.
సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం.. సెలవులు పొడిగింపు ప్రచారం ఉత్తిదే.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..
50 శాతం సబ్సిడీ.. ఒక్కో చీరకు 400 కూలీ..!
జకార్డ్ యంత్రం సాయంతో నాణ్యమైన వస్త్రాలు అతి తక్కువ ధరకే అందించే వీలుంటుంది. దీని ధర 3 లక్షల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఈ యంత్రాలు అందిస్తుండటంతో చాలామంది నేతన్నలు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. దాదాపు 12 గంటల సమయంలో రెండు చీరెలు నేసే వీలుంది. ఒక్కో చీర నేయడం ద్వారా వస్త్ర కార్మికులకు 400 రూపాయల వరకు కూలీ లభించనుంది. ఎవరైనా సరే ఈ యంత్రాన్ని సులభంగా నడిపించొచ్చు. పనిభారం అంతగా ఉండదు.. అలాగే శారీరక శ్రమ కూడా తక్కువగానే ఉంటుంది. రెండు మరమగ్గాలను ఒకేసారి నడుపుకునే వీలున్న ఈ యంత్రం ద్వారా నెలకు 25 వేల నుంచి 30 వేల రూపాయలకు వరకు సంపాదించుకునే వెసులుబాటు ఉంది.