"శిరీష అలాంటిదే అయితే.. ఎస్ఐకి సహకరించేది కదా!, నైలాన్ తాడుతో ఉరేసి హత్య"
నిందితులు, పోలీసులు, మీడియా చెబుతున్నట్లు.. 'రాజీవ్ తో శిరీషకు గనుక అక్రమ సంబంధం ఉండుంటే.. కుకునూర్ పల్లి ఎస్ఐకి కూడా సహకరించి' ఉండేదన్నారు. శిరీష క్యారెక్టర్ చెడ్డదే అయితే..
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. పోలీసులు చెప్పిన వివరాలతో ఏకీభవించని ఆమె కుటుంబ సభ్యులు.. కేసు పక్కదోవ పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, పోలీసులు, మీడియా కుమ్మక్కై శిరీష క్యారెక్టర్పై చెడు ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అది కచ్చితంగా హత్యే, సంచలన విషయాలు వెల్లడించిన శిరీష బాబాయి
శిరీష కేసు విచారణపై తాజాగా ఆమె బాబాయి శ్రీనివాసరావు పలు ఆరోపణలు చేశారు. బెంగుళూరులో నివాసముండే ఆయన.. తమ బిడ్డది ముమ్మాటికీ హత్యే అంటున్నారు. 'శిరీషను వేశ్యగా చిత్రీకరించేందుకు' మీడియా ఛానెళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో పోలీసులు చాలా విషయాలను దాచిపెడుతున్నారని, విచారణ సమగ్రంగా జరగడం లేదని ఆరోపించారు.
శిరీష అలాంటిదే అయి ఉంటే!
శిరీష తన కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు. నిందితులు, పోలీసులు, మీడియా చెబుతున్నట్లు.. 'రాజీవ్ తో శిరీషకు గనుక అక్రమ సంబంధం ఉండుంటే.. కుకునూర్ పల్లి ఎస్ఐకి కూడా సహకరించి' ఉండేదన్నారు. శిరీష క్యారెక్టర్ చెడ్డదే అయితే.. ఐదు నిమిషాలే కదా అని ఎస్ఐకి సహకరించి ఉండకపోయేదా? అని ప్రశ్నించారు.
నైలాన్ తాడుతో ఉరేసి:
శిరీష వ్యక్తిత్వం గురించి తెలియని పోలీసులు, మీడియా.. ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శిరీష ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారాన్ని ఖండించిన ఆయన.. ఆమె మెడ చుట్టూ నైలాన్ తాడుతో బిగించిన గుర్తులు ఉన్నాయని చెప్పడం గమనార్హం. తొలుత నైలాన్ తో మెడ చుట్టు బిగించి చంపేశారని, ఆ తర్వాత చున్నీతో ఉరేసుకున్నట్లుగా వేలాడదీశారని, అందువల్లే మెడ ఎముకలు విరిగాయని అన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిన మర్డర్ గా శ్రీనివాసరావు ఆరోపించారు.
కస్టడీలోకి తీసుకుంటే:
శిరీష కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ లను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే.. మిస్టరీగా ఉన్న పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శిరీషను ఎందుకు వారు టార్గెట్ చేశారు?.. వదిలించుకోవాలనుకున్నారా.. ఇందుకోసం వేశ్యగా ముద్ర వేయాలనుకున్నారా? లేక మరేమైనా కారణాలున్నాయా? అన్నది తేలాల్సి ఉంది. దీనికి తోడు కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లోని సీసీటివి ఫుటేజీ మాయమవడం కూడా కేసుపై అనుమానాలను మరింత పెంచుతోంది.
పోలీస్ స్టేషన్కు వెళ్లారా?:
రాజీవ్, శ్రవణ్ లు శిరీషను అసలు కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లలేదని, అక్కడికి 4కి.మీ దూరంలో ఉన్న ఓ రిసార్టుకు ఆమెను తీసుకెళ్లారని శిరీష బాబాయి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. శిరీషను ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి ఆత్మహత్య అన్న డ్రామాకు తెరలేపారని ఆయన ఆరోపిస్తున్నారు.