అక్కాచెలెళ్ల హత్య: ఢిల్లీలోని సోదరి ఇంట్లో నిందితుడు అమిత్ సింగ్?
హైదరాబాద్: హైదరాబాదులోని చైతన్యపురి జంట హత్యల కేసులో నిందితుడు అమిత్ సింగ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతన్ని పట్టుకోవడానికి మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. యామినీ సరస్వతితో పాటు ఆమె చెల్లెలు శ్రీలేఖలను అమిత్ సింగ్ అనే ప్రమోన్మాది హత్య చేసిన విషయం తెలిసిందే. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హత్య చేసిన తర్వాత అమిత్ సింగ్ పారిపోయాడు. అతను ఎటు పారిపోయాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమిత్ సింగ్ ఫోన్ స్విచాఫ్ చేశాడు. పోలీసులు బుధవారంనాడు అమిత్ సింగ్ తండ్రి అమర్ సింగ్ను ప్రశ్నించారు. చుట్టపక్కలవారిని కూడా పోలీసులు ప్రశ్నించారు.
ఢిల్లీలో ఉంటున్న తన కూతురు వద్దకు తన కుమారుడు అమిత్ సింగ్ వెళ్లిపోయి ఉంటాడని అమర్ సింగ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మంగళవారం నుంచి కూడా అమిత్ సింగ్ ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. ఇదిలావుంటే, అక్కాచెల్లెళ్ల అంత్యక్రియలు బుధవారం షాద్నగర్లో జరిగాయి.
షాద్నగర్ టీచర్స్ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్న కోడిగుడ్ల వ్యాపారి అమర్ సింగ్ కుమారుడు అమిత్సింగ్. అతనికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. షాద్నగర్లోని మరియారాణి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన అమిత్ సింగ్ విశ్వభారతి కళాశాలలోనే ఇంటర్ చదివాడు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాడు.
ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ కుటుంబం కొన్నేళ్ల కిందట షాద్నగర్కు వలస వచ్చింది. స్థానిక విశ్వభారతి కళాశాలలో శ్రీలేఖ, అమిత్ సింగ్ ఇంటర్ చదువుకు ఒకే సంవత్సరంలో చేరారు. ఒకరు ఎంపీసీ, మరొకరు ఎంఈసీ. అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే అమిత్ ప్రేమ పేరుతో శ్రీలేఖను వేధించేవాడు.