అక్కాచెల్లెళ్ల హత్య కేసు: అవకాశం చిక్కక అమిత్ సైకోగా మారాడా?
హైదరాబాద్: తాను ప్రేమించిన యువతి శ్రీలేఖను కలిసేందుకు నిందితుడు అమిత్ సింగ్ వారం రోజుల పాటు ప్రయత్నించాడని, ఆమెను కలవడానికి అవకాశం చిక్కకపోవడంతో సైకోగా మారి అక్కాచెల్లెళ్లను హత్య చేశాడని భావిస్తున్నారు. అమిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తలదాచుకుని ఉంటాడని పోలీసులు అనుమానించారు. కానీ ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ లభ్యం కాలేదు.
అమిత్ సింగ్ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ కావడంతో అక్కడి వెళ్లి ఉండవచ్చుననే ఉద్దేశంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో సోదరితో పాటు అతని స్నేహితుడు శివకుమార్ కూడా ఉన్నాడు. దీంతో అక్కడికి ఏమైనా వెళ్లి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఐదు పోలీసు బృందాలు అమిత్ సింగ్ కోసం గాలిస్తున్నాయి. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు అమిత్ కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారిస్తున్నారు. షాద్నగర్లో అమిత్ సింగ్తో పాటు ఇంటర్మీడియట్ చదివిని కొంత మందిని పోలీసులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
తాను ఇక బతనని అమిత్ సింగ్ తన తండ్రి అమర్సింగ్తో ఫోన్లో చెప్పాడని అంటున్నారు. దీన్నిబట్టి అతను ఏమైనా ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కాచెల్లెళఅలు యామిని, శ్రీలేఖలను హత్య చేసిన తర్వాత అమిత్ నేరుగా సికింద్రాబాదుకు వెళ్లినట్లు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రైలులో అతను బయలుదేరి వరంగల్లో దిగి ఏటూరునాగారం గానీ, భద్రాచలంలో గోదావరి పుష్కరాలకు గానీ వెళ్లి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. నిందితుడు అమిత్ సింగ్ను త్వరలోనే పట్టుకుంటామని ఎల్బీ డిసిపి తఫ్సీర్ ఇక్బాల్ అంటున్నారు.
కాగా, తనకు అవకాశం ఇస్తే అమిత్ సింగ్ను వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తానని అమిత్ సింగ్ తండ్రి అమర్ సింగ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. యామిని, శ్రీలేఖ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న రంజిత్ నుచి పోలీసులు వివరాలు సేకరించినట్లు తెలిసింది.