మరింత మంది అరెస్ట్: నయీం ఇంట్లో ఆయుధాలు, ఎక్కెడివి?
హైదరాబాద్: సిట్ అధికారులు గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో జరిపిన సోదాల్లో అత్యాధునిక ఏకే 47 గన్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నయీంతో పాటు నయీం అనుచరుల ఇళ్లలో ఆయుధాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు, ల్యాండ్ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు జరిపిన సోదాల్లో మొత్తం 19 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సిట్ ప్రత్యేక దర్యాప్తు అధికారి నాగిరెడ్డి గురువారం మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. పోలీసులు స్వాధీనం చేసుకన్న ఆయుధాల్లో ఏకే-47 గన్లు, 9 ఎమ్ఎమ్ పిస్టళ్లు, స్టెన్ గన్, 4 రివాల్వర్లతో పాటు తపంజాలు కూడా
పోలీసులు స్వాధీనం చేసుకన్న ఆయుధాల్లో ఎక్కువ భాగం బెల్జియం, రష్యా, జర్మనీ తయారీవే కావడం గమనార్హం. అయితే ఇవన్నీ కూడా నయీం ఎక్కడ నుంచి సేకరించాడని సిట్ బృందానికి అంతుపట్టడం లేదు. గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నా ఆయుధాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
12 కేసులు, నయీం భార్య హసీనా సహా 18 మంది అరెస్ట్: సిట్ ఛీఫ్ నాగిరెడ్డి
అయితే పోలీసులకు పట్టుపడిన నయీం అనుచరులను దీనిపై ప్రశ్నిస్తే తమకు ఏమీ తెలియదని, అంతా భాయ్ చూసుకుంటాడనే సమాధానం ఇస్తున్నారు. నయీం మాజీ మావోయిస్టు నేత కావడంతో నక్సల్స్తో పరిచయాలున్నాయి. దీంతో నక్సల్స్ ఆయుధాలు సరఫరా చేశారా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.
నయీంకు హిజ్బూల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని గతంలో పోలీసులు విచారణలో వెలుగు చూసింది. నయీం ఇంటి నుంచి సీజ్ చేసిన ఏకే 47 రైఫిల్ హిజ్బూల్ ముజాహిదీన్ సంస్థ చీఫ్ సలావుద్దీన్ నుంచి తీసుకువచ్చిందేనని అజ్మీర్ పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం.
2005వ సంవత్సరంలో నయీం కరడు కట్టిన ఉగ్రవాది అయిన సలావుద్దీన్తో సంప్రదింపులు జరిపి ఆయన దగ్గర నుంచి ఆయుధాలు సమీకరించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. మార్బుల్ బండలతో హైదరాబాద్కు వస్తున్న ఓ లారీలో ఏకే-47 రైఫిళ్లను అక్రమంగా తరలిస్తుండగా అజ్మీర్ పోలీసులు డ్రైవరును అరెస్టు చేసి, ఈ సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు అందించారు.
నయీమ్ గ్యాంగులో నెంబర్ 2 సలీమా: అసలు సూత్రధారి శేషన్న?
2005వ సంవత్సరంలో డిసెంబరు 26 వతేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు టోలిచౌకీలో హిజ్బూల్ ముజాహిదీన్ కమాండరుగా ప్రకటించుకున్న ముజీబ్ అహ్మద్ అలియాస్ అహ్మద్ భాయ్ను అరెస్టు చేశారు. ఆయుధాల వాహనం పోలీసులకు దొరకడంతో ఏకే 47 రైఫిళ్లను మరో మార్గంలో నయీం తెప్పించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అప్పట్లో ఓ మహిళ సహా ముజీబ్ అహ్మద్, అతని బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. హిజ్బూల్ ముజాహిదీన్ సంస్థ నుంచి అధునాతన తుపాకుల కొనుగోలు వ్యవహారంపై 2005లో హైదరాబాద్ సిటీ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం 786 నెంబరుతో ఓ కేసును నమోదు చేసి ఛార్జి షీట్ లో నిందితుడైన నయీం పరారీలో ఉన్నడని కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్లో పేర్కొన్నారు.
ఈ కేసులో నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ముజీబ్ అహ్మద్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇక, ఈ కేసులో ముజీబ్ సహచరులకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. అంతేకాదు ఒకసారి పాకిస్తాన్ వెళ్లి దావూద్ ఇబ్రహీంను కలిసి అక్రమాయుధాలపై చర్చించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే నయీంకు చెందిన అనుచరులను ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్ట్ చేసిన కోర్టులో హాజరుపరుస్తున్నారు. తాజాగా శుక్రవారం నల్గొండ జిల్లాకు చెందిన నయీం ప్రధాన అనుచరుడైన టెక్కు మధుని భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. సైబరాబాద్లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
డబ్బు కోసం ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో నవాబ్, రమేష్ అనే ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని నయీం అనుచరులైన కుమారస్వామి, శ్రీనివాస్ అనే వ్యక్తులను నల్గొండ జిల్లాలోని ఆలేరు కోర్టులో హాజరుపరిచారు.