నయీం కేసులో కీలక మలుపు: ఆయుధాలు సరఫరా చేసింది డ్రైవరే
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంకు ఆయుధాలు సరఫరా చేసిన వారిని నాగిరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. నయీం డ్రైవర్ శ్రీధర్ గౌడే ఆయుధాలు సరఫరా చేశాడని విచారణలో సిట్ అధికారులు గుర్తించారు. బీహార్ నుంచి ఆయుధాలు తెప్పించిన శ్రీధర్ గౌడ్ గ్యాంగ్ స్టర్ నయీంకు ఉచితంగా ఆయుధాలు సరఫరా చేశాడని అధికారులు విచారణలో వెల్లడైంది.
బీహార్ నుంచి తెప్పించిన ఒక్కో ఆయుధం రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు అమ్మినట్లు శ్రీధర్ గౌడ్ విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే శ్రీధర్ గౌడ్, నయీంకు ఫ్రీగా పిస్టోళ్లు, రివాల్వర్లు సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే గ్యాంగ్స్టర్ నయీం కేసుకు సంబంధించి సిట్ విచారణ కొనసాగుతోందని, ఆయనకు అనుకూలంగా ఎవరూ వ్యవహరించినా వదిలిపెట్టేది లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు.
కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నయీం బాధితులకు భూములిప్పిస్తామని, ఈ విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. చట్టానికి విరుద్ధంగా ఎవరూ పనిచేసినా వారిని క్షమించబోమని అన్నారు.
రాష్ట్రంలో ఇటీవల ఎస్సైలు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో ఎస్సైలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లాల స్థాయిలో ఎస్సైలకు ఎస్పీలు కౌన్సెలింగ్ నిర్వహించారని, ఒత్తిడికి లోనుకావద్దని చెప్పారని అన్నారు. ప్రజల్లో ఉండి పనిచేయాల్సిన వారు మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 550 పోలీస్స్టేషన్లకు కొత్త వాహనాలను సమకూర్చామని, ఎస్సైలకూ వాటిని అందజేశామని చెప్పారు. నగరాలలో పెట్రోలింగ్ నిర్వహించే వారికి వైర్లెస్ సెట్లు ఇచ్చామని, త్వరలోనే హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం జరుగుతుందని, అది పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే రాజధానికి సమాచారం చేరుతుందన్నారు.