ఛార్జీషీట్లో విఐపీల పేర్లు: నయీం కేసులో మాజీ పోలీస్ అధికారి విచారణ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో వీఐపీల పేర్లను కూడా ఛార్జీషీటులో నమోదు చేస్తామని సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తెలిపింది. ఇప్పటి దాకా 166 కేసులు నమోదు చేశామన్నారు. 18 పోలీస్ స్టేషన్లలో 109 మందిని అరెస్టు చేశామన్నారు. 413 మంది సాక్ష్యులను విచారించినట్లు చెప్పారు.
మాజీ పోలీస్ అధికారిని విచారించిన సిట్
నయీం కేసులో మాజీ పోలీసు అధికారిని సిట్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అధికారులు నార్సింగి పోలీస్ స్టేషన్లో సోమవారం నాడు ప్రశ్నించారు. రవీందర్ రెడ్డి సుమారు పదేళ్ల పాటు భువనగిరి, నల్గొండ ప్రాంతాల్లో డీఎస్పీగా పని చేశారు.
ఆయన పని చేసిన కాలంలోనే నయీం, అతడి అనుచరులు అనేక అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు. నయీం వ్యవహారాలతో పలువురు పోలీసులు, రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రవీందర్ రెడ్డిని ప్రశ్నించడం గమనార్హం. సిట్ అదనపు ఎస్పీ సాయికృష్ణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.