విచారణలో ఒప్పుకున్నారు: భువనగిరి వ్యాపారి విజయ్ని హత్య చేసిన నయీం
హైదరాబాద్: తెలంగాణ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో నిజానిజాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నయీం కేసులో విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మంగళవారం నల్గొండ జిల్లా భువనగిరి రిజిస్ట్రేషన్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు.
గ్యాంగ్ స్టర్ నయీం అక్రమ భూ రిజిస్ట్రేషన్లను సిట్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నయీం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములకు సంబంధించిన దస్తావేజులను సిట్ స్వాధీనం చేసుకుంది. నయీం అక్రమ రిజిస్ట్రేషన్లపై సబ్రిజిస్ట్రార్ల హస్తం ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.
దీంతో నయీం భూ అక్రమాలకు సహాయపడిన సబ్ రిజిస్ట్రార్ల పేర్లను రిజిస్ట్రేషన్ శాఖకు సిట్ పోలీసులు అందజేశారు. దీంతో నిజానిజాలు తెలుసుకుని చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కూడా సిద్ధమవుతోంది. అంతే కాకుండా నయీంతో సంబంధాలున్న సబ్రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఇక, నయీం గ్యాంగ్ అరాచకాల్లో బయటపడిన మరో హత్య కేసు మంగళవారం వెలుగు చూసింది. భువనగిరికి చెందిన వ్యాపారి విజయ్ కుమార్ను హత్య చేసినట్లు సిట్ విచారణలో నయాం అనుచరులు ఒప్పుకున్నారు. 2013లో జరిగిన ఈ హత్య కేసులో బాడీని శంషాబాద్ సమీపంలోని పెద్ద తూప్రాన్ వద్ద ఖననం చేసినట్లు నయీం అనుచరులు ఒప్పుకున్నారు.
శంషాబాద్ రూరల్ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గ్యాంగ్ స్టర్ నయీంకు చెందిన మరో ఇద్దరు అనుచరులను నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్బు దయాకర్, చిలకరాజు సురేశ్లను వలిగొండ వద్ద అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టులో హాజరు పరిచారు.
వీరికి న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను నల్గొండ జిల్లా కోర్టుకు తరలించారు. సాంబశివుడు, రాములు హత్య కేసులో చిలకరాజు సురేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.