నయీం కుడి భుజం 'శేషన్న' జాడను పసిగట్టిన పోలీసులు?
గ్యాంగ్స్టర్ నయీం కుడి భుజంగా వ్యవహరించిన శేషన్న అలియాస్ శేషయ్య ఆచూకీని పోలీసులు కనుగొన్నారని తెలుస్తోంది.
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కుడి భుజంగా వ్యవహరించిన శేషన్న అలియాస్ శేషయ్య ఆచూకీని పోలీసులు కనుగొన్నారని తెలుస్తోంది.
గత ఏడాదిలో మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్ వద్ద గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటన జరిగన సమయం నుండి శేషన్న తప్పించుకొని తిరుగుతున్నాడు. శేషన్న పోలీసులకు పట్టుబడితే ఈ కేసులో ఇంకా మరింత సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
శేషన్న డ్రైవర్ను ఇదివరకే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే శేషన్న కోసం నల్లమల్ల ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలను చేపట్టినట్టు సమాచారం.
రెక్కీ నిర్వహించడం, ప్రత్యర్థులను బెదిరించడం మాటవినని వారిని చిత్రహింసలు పెట్టడంలో శేషన్న నిష్ణాతుడు. నయీం నేర సామ్రాజ్య విస్తరణలో శేషన్న కీలకంగా వ్యవహరించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శేషన్న గతంలో పీపుల్స్వార్ పార్టీలో పనిచేసి కొంత కాలం క్రితం లొంగిపోయారు అయితే లొంగిపోయిన తర్వాత శేషన్న నయీంతో చేతులు కలిపాడు. అనతికాలంలోనే నయీంకు అత్యంత నమ్మకమైన అనుచరుడిగా మారాడు.
నల్లమలలో పోలీసులు గాలిపుచర్యలను చేపట్టిన సమయంలోనే శేషన్న ఆచూకీ నిఘావర్గాలకు లభ్యమైంది. నయీం దందాలపై సిట్ 197 కేసులను నమోదు చేసింది. ఆయా కేసులకు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానాల్లో 18 ఛార్జీషీట్లు దాఖలు చేశారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్నవారంతా బెయిల్పై విడుదలయ్యారు. మరికొన్ని కేసుల్లో కూడ తమవద్ద ఆధారాలు లేవని పోలీసులు కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ తరుణంలో శేషన్న ఆచూకీ లభ్యమైతే కొంత సమాచారం పోలీసులకు లభ్యమయ్యే అవకాశం లేకపోలేదు.