CAA Protest: దేశభక్తులమని చెప్పుకొంటే సరిపోదు: హిందుత్వ దేశంగా: మూర్ఖపు చర్య: సీతారాం ఏచూరి..!
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లారట్లేదు. ఇంకా రగులుకుంటూనే వస్తోంది. ఇప్పటిదాకా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలకు దిగిన ఉస్మానియా విద్యార్థులు ఈ సారి సదస్సులు, చర్చాగోష్ఠీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా.. సేవ్ ఇండియా పేరుతో ఓ సెమినార్ ను నిర్వహించారు.
125 కోట్లమంది చేతుల్లో ఆధార్: తొమ్మిదేళ్లలో 36 వేల కోట్ల సార్లు వినియోగం: రికార్డులు బ్రేక్.. !
భారత్ పట్ల చులకన..
దీనికి ముఖ్యఅతిథిగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. వందలాది మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.. తనదైనశైలిలో. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకుని రావడం వల్ల అంతర్జాతీయ దేశాల్లో భారత్ పట్ల చులకన భావం ఏర్పడిందని అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థకు విఘాతం..
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలు రాజ్యాంగ విరుద్దమని అన్నారు. తమకంటే గొప్ప దేశభక్తులు లేరని చెప్పుకొంటోన్న బీజేపీ నాయకులు.. రాజ్యాంగ వ్యవస్థను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించడం దేశభక్తి అనిపించుకోదని సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. దేశంలో మతోన్మాద రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని ధ్వజమెత్తారు.
హిందుత్వ దేశంగా..
జాతీయ సౌర నమోదు పేరుతో ప్రజలను మతోన్మాదం వైపు ఆకర్షితులను చేయడానికి కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. లౌకికవాద దేశంగా ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన భారత్ ను క్రమంగా హిందుత్వ దేశంగా మార్చడానికి చాప కింద నీరులా ప్రయత్నాలు సాగిస్తోందని, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని అన్నారు. బీజేపీ చర్యలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు ఇస్తోందని అన్నారు.
విద్యార్థులే ముందుకు రావాలి..
దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తమైన విషయాన్ని పక్కదారి పట్టించడానికి అనేక కుట్రలు, మోసాలకు తెర తీసిందని అన్నారు. దేశ ప్రజల దృష్టిని మరల్చిందని, పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు కార్యక్రమాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. ధరలను తగ్గించడంతో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని సూచించారు.