వేల కోట్లు దండుకోవడానికే..: కెసిఆర్పై ధ్వజమెత్తిన ఏచూరి
నిజామాబాద్: వేల కోట్లు దోచుకోవడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రాజెక్టుల డిజైన్ మార్పు చేస్తున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారి ఏచూరి ఆరోపించారు. బుదవారం నిజామాబాద్ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ప్రత్యేక తెలంగాణ వచ్చినా ప్రజల బతుకుల్లో మార్పు రాలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించిన ఊపు ఇప్పుడు లేదని వాపోయారు. ఇలాంటి సమయంలోనే వామపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరముందని ఏచూరి గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఈ సమస్యను పరిష్కరించామని చెప్పే ధైర్యం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలకు లేదని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవాచేశారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన దెయ్యం ఆ దెయ్యాన్ని వదిలించుకునే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు.
విర్రవీగిన వారెవరూ ప్రజల ముందు నిలవలేరని వీరభద్రం హెచ్చరించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కెసిఆర్ ఇప్పుడు కంటి తుడుపు చర్యగా కేవలం 720 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చారని తమ్మినేని విమర్శించారు.