సీటా..? వేటా..? అయోమయంలో తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేలు..!
తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. టిక్కెట్ల అంశంలో కొందరు నేతల మద్య సందేహం, మరికొంత మంది నేతల మద్య నైరాశ్యం, ఇంకొంతమంది నేతల మద్య అయోమయం నెలకొంది. దీంతో ఆశావహులు ప్రగతిభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్ల తమకే వస్తాయని ఇన్నాళ్లూ ధైర్యంగా ఉన్నా పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలతో తలపోటు మొదలైంది. పార్టీ అదినేత సిట్టింగ్ అభ్యర్థులుగా తమను పరిగణలోకి తీసుకుంటారా లేక పార్టీలోకి వలస వచ్చిన కొత్త నేతలకు ప్రధాన్యత ఇస్తారా అనే అంశం పై ఆందోళన చెందుతున్నారట సిట్టింగ్ ఎమ్మెల్యేలు. దీంతో స్పష్టత లేక చాలా మంది నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో సీట్ల వేట షురూ.. ప్రగతి భవన్ చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు..
టీఆర్ఎస్ లో టిక్కెట్ల అలజడి మొదలైంది. సిట్టింగ్ లు తమ సీట్లను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆశావాహులు తమ అద్రుష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమౌతున్నారు. నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం నేతలు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు.తమ వర్గాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.టిక్కెట్ వేటలో ఉన్నట్లు సంకేతాలు పంపిస్తు ప్రజల ద్రుష్టిని ఆకర్షిస్తున్నారు.ద్వితీయ శ్రేణి నాయకులు,కార్యకర్తలను తమ వైపు తిప్పుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుర్తింపు ఇస్తారా..? గెంటేస్తారా..?
ఫిరాయింపులతో ఓవర్ లోడ్ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిలో టిక్కెట్ల కోసం తీవ్రాతీ తీవ్రమైన పోటీ కనిపిస్తోంది.సిట్టింగ్ లకే సీట్లు అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికి ఆశావాహులు మాత్రం పట్టువీడటం లేదు.కనీసం నలభై సీట్లలో అభ్యర్థుల మార్పు ఖాయమని నమ్ముతున్న నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.దీంతో నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరు కనిపిస్తోంది.ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నాయకులు బహిరంగ ప్రదర్శనలకు దిగుతున్నారు.ఈ సారి సీటు సంపాదించకపోతే తమ రాజకీయ జీవితం ఖతం అవుతుందన్న ఆందోళనలో ఉన్న వారు టిక్కెట్ కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమౌతున్నారు.
వలసల వల్ల సిట్టింగులకు బెడద.. సిట్టింగ్ సీట్లు గల్లంతయ్యే ఛాన్స్..
రాష్ట్రంలో టీఆర్ఎస్ గుర్తుపైన గెలిచిన వారు 65 మంది ఎమ్మెల్యేలున్నారు.టీడీపీ నుంచి 13 మంది,వైసీసీ నుంచి ముగ్గురు,బీఎస్సీ నుంచి ఇద్దరు,సిపిఐ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు.దీంతో ఈ నియోజకవర్గాల్లో ఇంత కాలం టీఆర్ఎస్ తరుపున నాయకత్వం వహిస్తున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లోని అసలైన టీఆర్ఎస్ నేతలు నీరసపడిపోయారు. అయితే కొంత మంది మాత్రం టిక్కెట్ వేటను ఆపడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు కొనసాగిస్తున్నారు.ఇదే సమయంలో గత ఎన్నికల సమయంలో కూడా అనేక మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ లో చేరి అప్పటికప్పుడు సీటు సంపాదించుకున్నారు. వీరిలో కొంత మంది గెలుపొందగా,మరికొందరు ఇంఛార్జులుగా కొనసాగుతున్నారు.ఇక్కడ కూడా గ్రూపు రాజకీయాలు ఉన్నాయి.
నిజమైన తెలంగాణ వాదులను గుర్తించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
మరో వైపు తాజాగా జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మేయర్లు,జడ్పీటీసీలు అయిన అనేక మంది కూడా ఎమ్మెల్యే టిక్కెట్ వేటలో ఉన్నారు. అన్ని విధాలుగా పలుకుబడి సంపాదించుకున్న వీరు సిట్టింగ్ లకు వ్యతిరేకంగా కత్తిదూయడం ప్రారంభించారు. దీంతో శాసనసభ్యులు,వీరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది.మరో వైపు ఎమ్మెల్సీలు, పలువురు ఎం.పిలు కూడా అసెంబ్లీ బరిలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.ఫలితంగా ఒక్కొక్కొ నియోజకవర్గంలో అరడజను మంది నాయకులు శాసనసభ సీటు కోసం క్యూలో నిలబడినట్లైంది. ఎవనికి ఎలాంటి న్యాయం జరుగుతుందో గులాబీ బాసే చెప్పాలి.