భయంకరం.. వైరస్ విజృంభిస్తున్న వేళ.. తెలంగాణను హడలెత్తిస్తున్న విచిత్ర పరిస్థితులు..
భారత్ లాంటి దేశాల్లో కరోనా వైరస్ లాంటి ఉత్పాతాన్ని నియంత్రించడం ఎంత పెద్ద సవాలో స్పష్టమవుతోంది. నిరక్షరాస్యత,అజ్ఞానం,మూఢ నమ్మకాలు అన్నీ కలిపి దేశాన్ని ముంచే దుస్థితి కల్పిస్తున్నాయి. అభివృద్ది చెందిన దేశాలకు,భారత్కు ఇక్కడే స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అమెరికా,చైనా దేశాల్లో కరోనా వైరస్ను ఎదుర్కొన్నంత సులువుగా భారత్లో పరిస్థితులు లేవని అర్థమవుతోంది. కరోనా వైరస్ కంటే జనాల పిచ్చి నమ్మకాలను వదిలించడం పెద్ద సవాల్గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే కరోనాతో పాటు ఇప్పుడు మూఢ నమ్మకమనే వైరస్ కూడా బెంబేలెత్తిస్తోంది. ఫలితంగా ప్రభుత్వాలు చేపడుతున్న నియంత్రణ చర్యలు బూడిదలో పోసిన పన్నీరుగా చందంగా మారిపోతున్నాయి.
ఏంటీ వింత ప్రచారాలు
ఎవరు పుట్టించారో.. ఎలా పుట్టించారో తెలియదు గానీ.. ఆదివారం సాయంత్రం నాటికి ఒక పుకారు ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం.. ఒక్క కొడుకు ఉన్న తల్లి బోర్ పంప్ ఉన్న ఐదు ఇళ్లల్లో నుంచి బిందెలో నీళ్లు సేకరించి వేప చెట్టుకు పోయాలి. తద్వారా ఆ తల్లికి పుణ్యం ప్రాప్తిస్తుంది. జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో ఈ పుకారు జోరుగా షికారు చేస్తోంది. ఇదంతా నిజమేనని నమ్మిన కొంతమంది తల్లులు.. బిందెలు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. బోర్ ఉన్న ఇళ్ల గురించి ఆరా తీస్తూ నీళ్లు సేకరిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటిస్తే.. జనాలు ఇలా ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి వీధుల వెంట తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదువుకున్నవాళ్లు సైతం ఇలాంటి పిచ్చి ప్రచారాలను నమ్మి పాటిస్తుండటం మరింత ఆందోళన కలిగించే విషాదం.
ఆ రెండు జిల్లాల్లో..
జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల ఒక్క కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులున్న ఐదుగురు తల్లుల నుంచి చెంబెడు నీళ్లు తీసుకొచ్చి వేప చెట్టుకు పోయాలన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇవన్నీ నిజమేననుకుని నమ్ముతున్న తల్లులు.. వీధుల వెంట తిరుగుతూ నీళ్లు సేకరించే పనిలో పడ్డారు. కరోనా సోకుతుందన్న భయం కంటే.. ఆ పుణ్య కార్యమేదో చేయకపోతే పాపం చుట్టుకుంటుందన్న మూఢనమ్మకం వారిని వెంటాడుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సైతం మూఢ నమ్మకాలను పట్టుకుని వేలాడుతుండటం మొత్తం సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని చెప్పాలి.
మహిళలకు స్థానిక డాక్టర్ విజ్ఞప్తి
జగిత్యాల,నిజామాబాద్ జిల్లాలకు చెందిన నెటిజెన్స్ ఈ ప్రచారంపై ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సెటైర్స్ కూడా వేస్తున్నారు. తాజాగా ఎల్లల శ్రీనివాస్ రెడ్డి అనే డాక్టర్ అక్కడి ప్రజలకు ఓ వీడియో ద్వారా ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇదంతా ఓ పెద్ద కుట్ర అని.. కాబట్టి మహిళామణులంతా ఇలాంటి మూఢ ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం వైరస్ నియంత్రణ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతుంటే.. ఇలాంటి వదంతులను సృష్టించి మనల్ని చంపేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వేపచెట్టుకు నీళ్లు పోయాలని ఏ శాస్త్రం చెప్పలేదని.. ఏ పండితుడు చెప్పలేదని.. కాబట్టి మహిళలు ఇప్పటికైనా దీన్ని గమనించి ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.
Recommended Video
జనతా కర్ఫ్యూ రోజు కూడా ఇలాంటి వదంతులే..
ఇలాంటి వదంతులే జనతా కర్ఫ్యూ సమయంలోనూ జనంలో విపరీతంగా ప్రచారం జరిగాయి. చప్పట్లు కొట్టడం ద్వారా ఆ వైబ్రేషన్కి వైరస్ చనిపోతుందని వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది ప్రచారం చేయడంతో.. మహారాష్ట్ర లాంటి చోట్ల గుంపులు గుంపులుగా వీధుల్లోకి వచ్చి.. దాన్నో ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు మళ్లీ హోళీ జరుపుకున్నంత పనిచేశారు. అత్యవసర విభాగాల్లో నిరంతరం సేవ చేస్తున్న డాక్టర్లు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులు,ఫైర్ సిబ్బంది,ఎలక్ట్రిక్ సిబ్బంది,డ్రింకింగ్ వాటర్ సిబ్బంది.. ఇలా వీళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన చప్పట్ల కార్యక్రమాన్ని కొంతమంది అభాసుపాలు చేశారు. దాని అసలు ఉద్దేశమే దెబ్బతీసేలా సోషల్ డిస్టెన్స్ను పాటించకుండా వీధుల్లో రెచ్చిపోయి నృత్యాలు చేస్తూ బ్యాండ్ బాజా మోగించారు. ఇలాంటి అత్యుత్సాహాన్ని,అలాగే ఇలాంటి తరుణంలో వ్యాప్తి చెందుతున్న మూఢ నమ్మకాలను వదిలించుకుంటే తప్ప భారత్ కరోనా వైరస్ బారి నుంచి బయటపడలేదు.