చనిపోయిన ఐటీ ఉద్యోగుల పేర్లతో రూ. లక్షల బ్యాంక్ లోన్స్: ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: చనిపోయిన ఐటీ ఉద్యోగుల పేరుతో బ్యాంకులలో రుణాలు తీసుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామని, వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన వారని చెప్పారు.
చనిపోయిన ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా..
జనవరి 2న తమకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి ఫిర్యాదు వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామని సీపీ తెలిపారు. న్యూస్ పేపర్స్ ద్వారా చనిపోయిన వారి వివరాలు కలెక్ట్ చేసుకుని.. వారి పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి లోన్లు తీసుకున్నారని వివరించారు.
ఫేక్ డాక్యుమెంట్లతో భారీ మోసం..
చనిపోయిన నలుగురు ఐటీ ఉద్యోగుల పేరుతో వివిధ బ్యాంకుల్లో రూ. 53 లక్షల 95వేలు లోన్స్ తీసుకున్నారని సీపీ తెలిపారు. వీరి నుంచి 100 ఫేక్ ఓటర్ ఐడీ కార్డ్స్, 6 సెల్ఫోన్లు తోపాటు ఓ కారుని సీజ్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులపై గతంలో కూడా కేసులున్నాయని తెలిపారు. వీరందరిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కాగా, చనిపోయిన వారికి కూడా లోన్స్ ఇస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత సక్రమంగా పనిచేస్తోందో అర్థమవుతుంది. 100 ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేయగలుగుతున్నారంటే మన అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
డబుల్ బెడ్రూంల మోసం.. రూ. 2కోట్ల వసూళ్లు...
ఇది ఇలావుండగా, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠానుఅరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1.11 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. వెంకటవరప్రసాద్ ఆ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, ఇందులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మొత్తం 169 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పారు. రూ. 2కోట్ల మేర వసూలు చేయగా, వీరి వద్ద నుంచి రూ. 1.11కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. కిలో బంగారం, ఒక కారు, 6ఫోన్లు, లాప్ టాప్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ వచ్చే దరళాలను నమ్మి మోసపోవద్దని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే.