పోలీసులమని దోచుకున్నారు: కటకటాల పాలయ్యారు
హైదరాబాద్: టాస్క్ఫోర్స్ పోలీసులమంటూ రూ.35 లక్షలు దోపిడీ చేసిన ఆరుగురు దొంగలకు జైలు శిక్ష విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చినట్లు హైదరాబాదులోని పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం - పంజాగుట్ట, పోచమ్మబస్తీకి చెందిన ఆవుల రవికుమార్(34) అమీర్పేట్లోని స్టీల్ ఎక్సెంజ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కార్యాలయంలో పనిచేసేవాడు. ప్రతి రోజు కార్యాలయానికి పెద్దమొత్తంలో డబ్బును నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకురావడానికి రవికుమార్ వెళ్లేవాడు.
ఈ క్రమంలో డబ్బును కొట్టేయాలనే దురాశ పుట్టింది. దాంతో తన స్నేహితులైన ఎస్ఆర్నగర్, మూసాపేట్కు చెందిన నేనావత్ నగేష్, తెలుగు సుభాష్, బడా నగేష్, కొత్తింటి అభిలాష్, షేక్ ఖదీర్లతో కలిసి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా ఏప్రిల్ 24వ తేదీ 2012లో జుబ్లీహిల్స్ నుంచి రూ. 35 లక్షలు తీసుకొని అమీర్పేట్లోని కార్యాలయానికి ఆటోలో మరో ఇద్దరు కార్యాలయం సిబ్బందితో కలిసి వెళ్తున్నాడు.
ముందు వేసుకున్న పథకంలో భాగంగా మార్గమధ్యలో ఆటోను ఆటకాయించి, టాస్క్ఫోర్స్ పోలీసులమని, గంజాయి సరఫరా అవుతుందని సమాచారం వచ్చిందంటూ ఆటోను తనిఖీ చేసి, ప్రధాన నిందితుడైన రవికుమార్, అతని సహచరులిద్దరిని కొట్టి రూ.35 లక్షల డబ్బున్న బ్యాగ్ను లాక్కొని పారిపోయారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రవికుమార్ పథకంలో భాగంగానే అది జరిగిందని నిందితులను అరెస్ట్ చేసి రూ. 33 లక్షలు రికవరీ చేసి, పూర్తి విచారణ అనంతరం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలు చౌవాన్ ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును శుక్రవారం వెల్లడించింది. రెండో నిందితుడైనా నేనావత్ నగేష్కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా, మిగతా నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.