ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్: ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య..
హైదరాబాద్: పరీక్షల్లో ఎక్కడ ఫెయిల్ అవుతామోనన్న భయంతో కొందరు.. తక్కువ మార్కుల రావడాన్ని అవమానంగా భావించి మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి.
శుక్రవారం నాడు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల నేపథ్యంలో.. ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందులో నాలుగు సంఘటనలు హైదరాబాద్లో చోటు చేసుకున్నవే కాగా.. ఒక సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.
కాచిగూడకు చెందిన నీరవ్ మార్షు(18) సెకండియర్ లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే.. నీరవ్ పాస్ అయి ఉండటం గమనార్హం.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం నీరవ్ జీవితాన్ని బలితీసుకుంది. సెయింట్ ఫ్రాన్సిస్ క్సేవియర్ జూనియర్ కాలేజీలో ఇతను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఇక వనస్థలిపురంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆచంట వందన(16) ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బైపీసీలో తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో శుక్రవారం ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది.