పిడుగుపడి ముగ్గురు మృతి: చెరువులో పడి మరో ముగ్గురు చిన్నారులు..
వరంగల్: జిల్లాలోని చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం నెలకొంది. చెరువులో పడి రెండో తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను సాయిలు, అఖిల, అజయ్గా స్థానికులు గుర్తించారు.
ఈ ముగ్గురు పిల్లలు బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్నారుల మృతి వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బుధవారం మధ్యాహ్నం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజిపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు గ్రామ శివారులోని దర్గా వద్ద కందూరు పండుగ చేసేందుకు వెళ్లారు.
దేవుడికి నైవేద్యం పెట్టేందుకు వంటలు తయారు చేస్తున్న క్రమంలో వర్షం పడింది. వెంటనే తలదాచుకోవడానికి ఆ పక్కనే ఉన్న చెట్టు కిందకు పరుగెత్తారు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టుకింద ఉన్నవారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు.
గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ వాహనంలో మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పాల్కొండ కృష్ణయ్య(52), ఎండీ సోహెల్(7), పెద్దమందిడి మండలం జంగమాయపల్లె గ్రామానికి చెందిన సుంకర రాములు(55) మృతిచెందారు. గాయపడిన వ్యక్తి మానాజిపేటకు చెందిన ఎండీ ఇమ్రాన్గా గుర్తించారు.