రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి.. రాత్రిపూట స్వస్థలాలకు..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాట్ ఏస్ వాహనాన్ని ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కర్ణాటకకు చెందిన కూలీలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ఒక చిన్నారి,బాలిక కూడా ఉన్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో కూలీ పనులు నిలిచిపోవడంతో సూర్యాపేట నుంచి వీరంతా స్వస్థలం రాయచూర్కి బయలుదేరారు. ప్రమాద సమయంలో లారీ,టాటా ఏస్లో కలిపి 30 మంది వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారైనట్టు పోలీసులు తెలిపారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండటం మంచిదని.. ఇలా వేరేచోట్లకు ప్రయాణాలు మంచివి కాదని తెలిపారు. అయితే కొంతమంది కాలినడకన సైతం వందల కి.మీ నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.
Recommended Video
ఇక తెలంగాణలో ఇప్పటివరకు 59 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు సీఎం తెలిపారు. మిగిలిన మందికి సికింద్రాబాద్ గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో 10 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో 60వేల కరోనా పేషెంట్లను హ్యాండిల్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిిసందే.