విషాదం : పెళ్లి బట్టలు కొనేందుకు బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి...
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరిని ఆటో డ్రైవర్గా గుర్తించారు. గూడూరు మండలం మర్రిమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బట్టలు కొనేందుకు వారు ఆటోలో వరంగల్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అతివేగంతో దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
వారం రోజుల క్రితం నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో బొలెరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామం వద్ద ప్రమాదం జరగ్గా... మృతులను దేవరకొండ మండలం చింతబావికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరంతా వరినాట్ల కోసం రంగారెడ్డి గూడెం వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది.