ఆరేళ్ల బాలుడి పాదయాత్ర... కేసీఆర్ తాతయ్యా న్యాయం చేయండంటూ విజ్ఞప్తి...
సిరిసిల్లకు చెందిన ఓ ఆరేళ్ల బాలుడు తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరుతున్నాడు. తన తల్లిదండ్రులు చనిపోయాక... తమకున్న ఎకరా భూమిని ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడని ఆరోపిస్తున్నాడు. దయచేసి తమ భూమిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం(నవంబర్ 3)తమ గ్రామం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు ఆ బాలుడు పాదయాత్ర చేయడం గమనార్హం.
బాధితుల కథనం ప్రకారం.... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లికి చెందిన కుమారస్వామి, మమతలకు నాగప్రణీత్(6) అనే కుమారుడు ఉన్నాడు. 2017లో అనారోగ్య సమస్యలతో కుమారస్వామి-మమత చనిపోయారు. అప్పటినుంచి నాగప్రణీత్ తాతయ్య వద్ద పెరుగుతున్నాడు. కుమారస్వామి-మమత బతికున్నప్పుడు తమ ఎకరా భూమిని ఓ వ్యక్తికి కౌలుకు ఇచ్చారు.
మాజీ ప్రజాప్రతినిధి అయిన సదరు వ్యక్తి... ఆ ఇద్దరూ బతికున్నంత కాలం కౌలు చెల్లించాడు. అయితే ఆ దంపతులు చనిపోయాక... ఆస్తిని చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. తనకున్న పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ రికార్డుల్లో భూమిని తన పేరిట మార్పించుకున్నాడు. దీంతో కుమారస్వామి-మమతల ఒక్కగానొక్క కుమారుడు నాగప్రణీత్(6) తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని తనకు దక్కేలా చేయాలని కోరుతూ.. మంగళవారం తన తాతతో కలిసి లింగంపల్లి గ్రామం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టాడు.
ఈ సందర్భంగా... 'కేసీఆర్ తాతయ్యా... మోదీ తాతయ్యా...' నాకు న్యాయం చేయండని ఆ బాలుడు విజ్ఞప్తి చేశాడు. మాజీ ప్రజాప్రతినిధి తమ భూమిని కబ్జా చేసిన వ్యవహారంపై గతంలోనే రెండుసార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. అప్పటి జాయింట్ కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించినా... ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని తాజాగా వాపోయారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం మరోసారి కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు.