చిన్న శాటిలైట్ల ప్రయోగానికి విక్రమ్!.. రాకెట్ల తయారీలో నిమగ్నమైన స్కైరూట్!
హైదరాబాద్ : రోదసి రహస్యాలపై మనిషి ఆసక్తి పెరుగుతోంది. అంతరిక్షం గుట్టును తెలుసుకునేందుకు అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లు నింగిలోకి పంపడం పెరుగుతోంది. డిమాండ్ దృష్యా రానున్న పదేళ్లలో శాటిలైట్ మార్కెట్లో అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశముంది. అందుకే ఆ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని కొత్త స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఇదే దిశగా అడుగులు వేస్తోంది.
ఇస్రోలో ఉద్యోగం వదిలి
2017లో కేంద్రం స్పేస్ యాక్టివిటీస్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ప్రవేట్ కంపెనీలు సైతం అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించే ఈ బిల్లు గురించి తెలిసిన వెంటనే ముగ్గురు ఇస్రో సైంటిస్టులు తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారు. పవన్ కుమార్ చందన, నాగ భరత్, వాసుదేవన్లు స్కైరూట్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు.
ఒక్కరోజులోనే అసెంబుల్
చిన్న శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపడమే స్కైరూట్ బిజినెస్. ఇందుకోసం విక్రమ్ పేరుతో మూడు రాకెట్లు సిద్ధం చేశారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా రాకెట్లకు విక్రమ్ అనే పేరు పెట్టారు. విక్రమ్ 1 రాకెట్ను ఒక్కరోజులోనే అసెంబుల్ చేసే అవకాశముండగా.. మిగతా రెండింటిని మూడు రోజుల్లో అసెంబుల్ చేసి ప్రయోగించేలా రూపకల్పన చేశారు.
2021లో తొలి రాకెట్
విక్రమ్ పేరుతో రూపొందించిన రాకెట్ పరీక్షల కోసం స్కైరూట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్.. డీఆర్డీవో సాయం తీసుకుంటోంది. 2021లో కంపెనీ తొలి రాకెట్ లాంఛింగ్కు సిద్ధమవుతోంది. శాటిలైట్ లాంఛింగ్ మార్కెట్లోకి ప్రైవేట్ కంపెనీ రాకతో అందుకయ్యే వ్యయం మూడో వంతు తగ్గుతుందని స్కైరూట్ చెబుతోంది.