ఇలా మొబైల్ షాప్కు కన్నమేసి, స్మార్ట్గా ఫోన్లు కొట్టేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదులోని మలక్పేటలోని ఓ మొబైల్ షాపు షోరూంలో భారీ చోరీ జరిగింది. గోడకు కన్నం పెట్టిన దుండగులు 90 స్మార్ట్ ఫోన్లను దొంగలించారు. దాదాపు పది లక్షల రూపాయలు విలువ చేసే వీటిని కవర్లో నుంచి అక్కడే తొలగించి కేవలం ఫోన్లతో పరారయ్యారు.
చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్తయ్య కథనం ప్రకారం - మలక్పేట ప్రధాన రహదారి పై ఎంకే మొబైల్స్ షాపును ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి దుకాణానికి తాళం వేసి తిరిగి శుక్రవారం ఉదయం షటర్లు తెరిచి చూసే సరికి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. షాపులో కన్నం ఉండడం గమనించి చోరీ జరిగిందని గ్రహించి చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం అందించాడు.
ఇన్స్పెక్టర్ సత్తయ్య, డిఐ ధీరావత్ హుస్సేన్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తును వేగవంతం చేశారు. తగిన ఆధారాలు సేకరించారు. మొబైల్ షాపులో దొంగతనానికి ముందు దొంగలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన రహదారి వైపు మొబైల్ షాపు షటర్లు తొలగించడం కష్టమని భావించి వెనుక వైపు దుకాణంలోకి వచ్చే విధంగా గునపంతో కన్నం వేశారు. అంతకంటే ముందు లోపలికి వెళ్లేందుకు ప్రధాన గేట్కు తాళ్లం ఉండడం వల్ల ప్రహరీకి పక్కనే ట్రాన్స్ఫార్మర్ వెనుక ఉన్న ఫ్లెక్సీని కత్తిరించి లోపలికి ప్రవేశించారు.
ఇద్దరు లేదా ముగ్గురు నిందితులు ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. దుకాణంలో పని చేసే సిబ్బంది వేలి ముద్రలను సైతం సేకరించారు. ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఎల్.టీ.చంద్రశేఖర్, సుల్తాన్బజార్ ఏసీపీ గిరిధర్ పరిశీలించారు.