స్మార్ట్ కల్లు ...బుకింగ్ పేమెంట్ అంతా ఆన్ లైన్ .. లాక్ డౌన్ ఎఫెక్ట్
కరోనా లాక్ డౌన్ ప్రభావంతో మద్యం షాపులు ఇప్పట్లోతెరుచుకునే పరిస్థితి లేదు . ఇక బ్లాక్ మార్కెట్ లో మద్యం కొనుగోలు చెయ్యాలన్నా పదింతలు పెరిగిన ధరలతో కొనుగోలు చెయ్యలేకపోతున్నారు. ఈ సమయంలోనే అందరి దృష్టి కల్లు మీద పడింది. దీంతో మూడు కుండలు, 36 బాటిళ్ళుగా కల్లు వ్యాపారం సాగుతుంది. ఇక పరిస్థితి ఎలా వచ్చిందంటే కల్లు కావాలంటే ముందుగానే బుకింగ్ చేసుకుని ఆన్ లైన్ లో చెల్లింపులు కూడా చేసి వాళ్ళు చెప్పిన టైమ్ కు వెళ్లి కల్లు తెచ్చుకునే దాకా వచ్చింది.
108 కు కాల్స్ వెల్లువ .. మద్యం షాపులు తెరిపించండి .. గోడు వెళ్ళబోసుకుంటున్న మందుబాబులు
కల్లు బుకింగ్ , పేమెంట్ అంతా ఆన్ లైన్ లోనే
తాజా పరిణామాల నేపధ్యంలో రెండు, మూడు రోజుల ముందు బుకింగ్ చేసుకుంటేనే కల్లు దొరికే పరిస్థితి ఉందంటే కల్లుకున్న గిరాకీ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అంతే కాదు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఆన్ లైన్ లో పేటీఎం ద్వారా గానీ , గూగుల్ పే ద్వారా గానీ డబ్బు బదిలీ చెయ్యాలి . ఇలా ఆన్ లైన్ లో చెల్లింపు చేసి బుక్ చేసుకున్న కల్లు , గీత కార్మికులు చెప్పిన టైమ్ కు వెళ్లి తెచ్చుకోవాలి .
కల్లుగీత కార్మికులకు కాసుల వర్షం కురిపిస్తున్న లాక్ డౌన్
కరోనా వైరస్ మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరించకుండా అడ్డు కట్ట వెయ్యాలని భావించిన సర్కార్ లాక్ డౌన్ విధించినా కల్లు కోసం జనాలు ఎగబడుతున్న పరిస్థితుల్లో కల్లు గీత కార్మికులు కల్లు అమ్మటానికి స్మార్ట్ విధానం ఎంచుకున్నారు. మారుతున్న కాలంతో పాటు , మారుతున్న పరిస్థితులను బట్టి వారు కూడా మారుతున్నారు. అందరి ఉపాధి మీద కరోనా దెబ్బ కొడితే కల్లు గీత కార్మికులకు మాత్రం కరోనా కాసుల వర్షం కురిపిస్తుంది. గ్రామాల్లో కల్లు కోసం నగరాలు, పట్టణాల నుండి డిమాండ్ కొనసాగుతుంది.
కల్లు కోసం పడిగాపుల్లేవ్.. అంతా స్మార్ట్ విధానమే
దీంతో కల్లు గీత కార్మికులకు డిమాండ్ జోరుగా పెరిగింది . నిన్నా మొన్నటి దాకా 30 రూపాయలు అమ్మిన కల్లు సీసా ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు అమ్ముతుంది . ఇక కచ్చితంగా కావాలంటే ధర ఇంకో రెండు రెట్లు అధికం . కల్లు కోసం తాటి, ఈత వనాల వద్ద పడిగాపులు పడిన వారు ఇప్పుడు స్మార్ట్ విధానం అనుసరిస్తున్నారు . ఎండాకాలం కావటంతో ఇప్పుడు కల్లు బాగానే అవుతుంది అని, ప్రజల డిమాండ్ మేరకు అందిస్తున్నామని కల్లుగీత కార్మికులు చెప్తున్నారు .
కల్లు గీత కార్మికులకు కలిసొచ్చిన కరోనా లాక్ డౌన్
మద్యం షాపులు లేకపోవటం , తాటి, ఈత కల్లు శ్రేష్టం అని జనాలు భావించటం కల్లుగీత కార్మికులకు వరంలా మారింది . అన్ని రంగాల మీద అన్ని కుల వృత్తుల మీద కరోనా దుష్ప్రభావం చూపిస్తే తాటి, ఈత వనాలను నమ్ముకున్న , ప్రకృతితో ముడిపడిన జీవన విధానం సాగించే కల్లుగీత కార్మికుల విషయంలో మాత్రం కరోనా కలిసి వచ్చేలా చేసింది. ఖాళీగా ఉండలేక టైం పాస్ కోసం కొందరు , ఈ లాక్ డౌన్ పీరియడ్ ఎంజాయ్ చేద్దాం అని మరికొందరు ఇలా అందరూ కల్లు కోసం వెంపర్లాడుతున్నారు . ఏది ఏమైనా కల్లు గీత కార్మికులకు ఉపాధిని అందించటమే కాదు ఒక స్మార్ట్ విధానానికి కరోనా లాక్ డౌన్ దోహదం చేసింది .