ఔట్లుక్కి చిక్కేనా?: స్మిత కార్టూన్పై ఐఏఎస్ అధికారుల తీర్మానాలు
హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పైన అనుచిత కార్టూన్ కథనం ప్రచురించిన ఔట్ లుక్ మేగజైన్కు చిక్కులు తప్పేలా లేవు. ఔట్ లుక్ మేగజైన్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ శుక్రవారం తీర్మానం చేసింది. పలు తీర్మానాలు చేసింది.
శుక్రవారం వారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను కలిశారు. ఒక ఐఏఎస్ మహిళా అధికారిణి పట్ల అనుచిత కథనం రాసిన ఆ మేగజైన్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకు వెళ్లాలని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ నిర్ణయించింది. ఎన్హెచ్చార్సీ, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి. అలాగే, ఔట్ లుక్ మేగజైన్ రిజిస్ట్రేషన్ రద్దుకు వారు డిమాండ్ చేస్తున్నారు.
పత్రిక పైన పిల్ వేసేందుకు న్యాయసలహాలు తీసుకుంటున్నట్లు ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ తెలిపింది. స్మితా సబర్వాల్కు ఆర్థికంగా, న్యాయపరంగా ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.
కాగా, ఔట్ లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, హైదరాబాదులోని అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాలకు స్మితా సబర్వాల్ తరఫు న్యాయవాది ఈ-నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని అందులో పేర్కొన్నారు.
ది బోరింగ్ బాబు అనే కథనంతో తాము ఎవరి పేర్లు పేర్కొనలేదని, అయినా తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసులు పంపారంటూ కొన్ని వార్తా పత్రికలు, టీవీ న్యూస్ ఛానళ్లు వెబ్ సైట్లు చెప్పాయని ఔట్ లుక్ చెప్పింది.
మీడియా గందరగోళం మొదలై 36గంటలు దాటినా తమకు మాత్రం నోటీసులు రాలేదని చెప్పింది. స్మితా సబర్వాల్ సీఎంవో కార్యాలయంలో అడిషనల్ కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలెక్టర్గా పని చేశారు.