ఏపీ ఎక్స్ప్రెస్ దట్టమైన పొగలు: లోకోపైలట్ అప్రమత్తతో తప్పిన ముప్పు, జనం పరుగులు
హైదరాబాద్: విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ రైలులోఅకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు ఒక గంట పాటు రైలుని నిలిపివేశారు. ఏపీ ఎక్స్ప్రెస్ ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్లో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు.
ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులు రైల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. రైల్వేస్టేషన్లో ఉన్న ప్రయాణికులు కూడా భయంతో పరుగులు పెట్టారు. రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
గంట నుంచి నెక్కొండ స్టేషన్లోనే ఏపీ ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేసి తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు, అస్వస్థత కలగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కరోనా వ్యాప్తి కారణంగా పలు రైళ్ల రద్దు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వేశాఖ కలవరపడుతోంది. ఈ మేరకు కరోనా కేసులు పెరగుతుండటంతో జనవరి 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రద్దయిన జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఉన్నాయి. మేడ్చల్-సికింద్రాబాద్, తిరుపతి-కాట్పాడి, డోన్-గుత్తి, డోన్-కర్నూల్ సిటీ, రేపల్లె-తెనాలి, సికింద్రాబాద్-ఉందానగర్ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.