కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో పొగలు, ఏం జరిగిందంటే?
Recommended Video
కరీంనగర్:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకొన్నారు. కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఉన్న బ్యాగులో నుండి పొగ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై హెలికాప్టర్ను అత్యవసరంగా దించి బ్యాగును దూరంగా వేశారు.
కరీంనగర్ జిల్లా నుండి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం నాడు బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. కరీంనగర్ జిల్లా నుండి హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కెసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లోని బ్యాగులో పొగలు రావడాన్ని పోలీసులు గుర్తించారు.
ఈ బ్యాగులో వైర్లైస్ సెట్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అధికారులతో మాట్లాడేందుకు ఈ వైర్లెస్ సెట్ ఉంది. వైర్లెస్ సెట్ ఉన్న బ్యాగులో నుండి పొగలు వస్తున్న విషయాన్ని హెలికాప్టర్ టేకాఫ్ అయిన క్షణాల్లో సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.
అయితే క్షణాల్లోనే దాన్ని గుర్తించి వెంటనే హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేసి బ్యాగ్ ను బయటవేశారు. బ్యాగును గుర్తించకపోతే గాల్లోనే బ్యాగు మండిపోయే అవకాశం ఉండేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయా అనే కోణంలో కూడ ఆరా తీస్తున్నారు. మరో వైపు వైర్ లెస్ సెట్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని సెక్యూరిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ ఘటనపై మంత్రి కెటిఆర్ కూడ స్పందించారు. ఆల్ ఈజ్ వెల్ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. మొత్తంగా ముఖ్యమంత్రి కెసిఆర్తో పాటు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.