గంజాయి రవాణాకు మహిళలే టార్గెట్: ఊబిలోకి లాగుతున్న స్మగ్లర్లు
గంజాయి ఘాటు గుప్పుమంటోంది. వరంగల్ మహానగరం అడ్డాగా యథేచ్ఛగా గంజాయి మాఫియా కార్యకలాపాలలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
వరంగల్: గంజాయి ఘాటు గుప్పుమంటోంది. వరంగల్ మహానగరం అడ్డాగా యథేచ్ఛగా గంజాయి మాఫియా కార్యకలాపాలలు సాగుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్ రైల్వే స్టేషన్ పరిసరాలు, వరంగల్, హన్మకొండలోని పలు సంపన్న కాలనీల్లో అద్దెకు ఉంటూ దందాను చక్కబెడుతున్నట్లు సమాచారం.
గంజాయి రవాణాకు మహిళలను కరివేపాకులా వాడుకొని వదిలేస్తున్నారు కొందరు స్మగ్లర్లు. ఈ క్రమంలో మాఫియా నిర్వాహకులకు కోట్లు సమాకూరుతుండగా, గంజాయిని తరలిస్తూ పోలీసుకు చిక్కే మహిళకు జైలు గోడలే గతి అవుతుఆన్నయి. ఇలా పట్టుబడ్డ వనితల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
గంజాయి మాఫియా ప్రధానంగా ఒంటరి మహిళనే కొరియర్లుగా ఎంపిక చేసి, వారికి ఈజీమనీ ఎరగావేసి ముగ్గులోకి దింపుతుండటం గమనార్హం. గత సోమవారం ఒకేరోజు ఏడుగురు మహిళలు రూ. 4 లక్షల విలువైన గంజాయిని తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కడం గమనార్హం.
తక్కువ శ్రమ... ఎక్కువ లాభం అంటూ వలవేసి....
''తక్కువ శ్రమ.. ఎక్కువ లాభం''...అంటూ ఒంటరి మహిళలకు ఆశలు కల్పిస్తోంది గంజాయి మాఫియా. ఆ మాయమాటలు నమ్మి, చట్టవ్యతిరేకమని తెలిసినా గంజాయి ప్యాకెట్లు తరలించే సాహసానికి పూనుకుంటున్నారు కొందరు మహిళలు.
గత ఎండాకాలంలో ఎండబెట్టిన గంజాయిని ఇటీవల మహారాష్ట్ర, ముంబై, డిల్లీ, బీహార్ రాష్ట్రాలకు తరలిస్తుండగా పలువురు మహిళలు పోలీసులకు దొరికిపోయారు. ఇలా ఖాకీలకు దొరికినవారిని సైతం గంజాయి మాఫియా నడిపే స్మగ్లర్లు బెయిల్పై విడిపిస్తున్నారు. తామేదో సాయం చేసినట్లుగా సదరు మహిళలకు చెప్పి. గంజాయి రవాణాను భవిష్యత్తులోనూ కొనసాగించేలా ఒప్పిస్తున్నారు. మరోవైపు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ మహిళ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
ట్రాప్ చేస్తున్న సీనియర్లు....
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గంజాయి వ్యాపారం చేసిన కొందరు మహిళలే ఇంకొంతమందిని ఆ ఊబిలోకి లాగుతున్నట్లు సమాచారం. కొందరు స్మగ్లర్లు గిరిజన మహిళలను వివాహం చేసుకుంటామని నమ్మించి వారి వ్యాపారానికి వాడుకుంటున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్, పాడేరు ప్రాంతాలు, జయశంకర్ జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, భూపాపల్లి, వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్లోని అటవీ ప్రాంతాల్లో గంజాయిని రహస్యంగా పండిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయా ప్రదేశాల నుంచి రహస్యంగా ఖరీదైన కార్లలో మహిళల ద్వారా గంజాయిని వరంగల్ మహానగరానికి చేరవేస్తున్నారు. నగరంలోని క్లాస్గా ఉండే కాలనీల్లో ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఆ ఇళ్లకే రాత్రికి రాత్రి గంజాయిని తీసుకొచ్చి, ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ మొత్తం కార్యకలాపాలు కేవలం మహిళల ద్వారానే చేయిస్తోంది గంజాయి మాఫియా.